Woman Behind Osmania University: ఓయూలో లఖాబాయి స్మారకం ఏర్పాటుచేయాలి
ABN, Publish Date - Dec 24 , 2025 | 02:01 AM
ఆమె ఒక గజల్ గాయని, కవయిత్రి, రాజనర్తకి, యుద్ధవిద్యల్లో ఆరితేరింది. రెండవ నిజాం నవాబు మీర్ నిజాం ఆలీఖాన్ (1734–1803)కి రాజకీయ సలహాదారు. ఆయనతో కలిసి...
ఆమె ఒక గజల్ గాయని, కవయిత్రి, రాజనర్తకి, యుద్ధవిద్యల్లో ఆరితేరింది. రెండవ నిజాం నవాబు మీర్ నిజాం ఆలీఖాన్ (1734–1803)కి రాజకీయ సలహాదారు. ఆయనతో కలిసి మూడుసార్లు యుద్ధరంగానికి వెళ్లిన చరిత్ర ఆమెది. అంత విశ్వసనీయురాలు కాబట్టే మహ్ లఖాబాయి చందా (1768–1824)కు నవాబు వేల ఎకరాల భూములున్న అడిక్మెట్ జాగీరు రాసిచ్చారు. నూరుగురు సైనికుల రక్షణ కూడా కల్పించారు. తాన్సేన్ మనవడు ఆమెకు సంగీతంలో గురువు. ఆమె రచించిన ఉర్దూ గజల్ సంకలనం ‘దివాన్’ 1798లోనే వెలువడింది. హైదరాబాద్ దక్కన్ ముషాయిరాలలో పాల్గొన్న ఏకైక మహిళ ఆమె.
అంతటి ప్రజ్ఞాశాలి హృదయంలో స్థానం సంపాదించినవారు అనాధ బాలికలు. వారిని చేరదీసి, ఆ రోజుల్లో భారీ విరాళం ఇచ్చి, వారికి సంగీతనాట్యాలు నేర్పించే కేంద్రానికి కావలసిన భూములను దానం చేసింది లఖాబాయి. అలా ఆ భూముల్లో నిర్మించిందే ఉస్మానియా యూనివర్సిటీ. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన పేర హైదరాబాద్లో ఒక ఉర్దూ యూనివర్సిటీ పెట్టాలనుకున్నప్పుడు, 1917లో వారికి అందివచ్చినవి లఖాబాయికి చెందిన 2500 ఎకరాల జాగీరు భూములే. అందులో 1923–39 మధ్య నిర్మాణమయిందే ఆర్ట్స్ కాలేజీ, మరెన్నో క్యాంపస్ భవనాలు కూడా.
హైదరాబాద్ సమీపంలోని మౌలాలి కొండపై, పరిసర ప్రాంతాల్లో ఆమె నిర్మించిన కట్టడాలు, అక్కడేవున్న ‘మహ్ లఖాబాయి చందా’ సమాధి... ఆమెను ఇప్పటికీ మనకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాయి. అయితే ఆమె పేరు ఇప్పటివరకు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని ఒక్క బిల్డింగ్ కైనా, కనీసం ఏదో ఒక గ్రంథాలయానికైనా పెట్టకపోవడం ఆశ్చర్యకరం. కేవలం క్యాంపస్లోని ఇఫ్లూలో ఉన్న ఆ కాలం నాటి మెట్లబావిని మాత్రం ఆమె పేరుతో పిలుస్తున్నారు. ప్రస్తుత వైస్ఛాన్సెలర్ హయాంలోనైనా ఆమె స్మారకచిహ్నం ఏర్పాటు చేస్తారని హైదరాబాద్ చరిత్ర అభిమానిగా ఆశిస్తున్నాను.
వేముల ప్రభాకర్, సికింద్రాబాద్
ఇవి కూడా చదవండి...
ధాన్యం కొనుగోళ్లలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ విధానం మేరకు తక్షణ చర్యలు..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టీడీపీ మాజీ ఎంపీకి కేంద్రంలో కీలక పదవి
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 24 , 2025 | 02:01 AM