Hyderabad: ఫేస్బుక్లో పరిచయమై.. ట్రావెల్ బ్యాగులో శవమై..
ABN, Publish Date - Jun 07 , 2025 | 07:07 AM
ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన ఓ యువకుడిని నమ్మి.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంది ఓ మహిళ. అక్రమ సంబంధాలు.. సహజీవనాలు.. తాత్కాలిక ఆనందాల కోసమేనని ఇక్కడ జరిగిన ఓ సంఘటన నిజం చేసింది. ట్రావెల్ బ్యాగులో శవంగా మారిపోయింది. ఇక వివరాల్లోకి వెళితే...
- గర్భం తొలగించుకోకపోవడంతోనే నేపాలీ మహిళ హత్య
- ర్యాపిడో బుక్ చేసిన నంబర్ ద్వారా నిందితుడి గుర్తింపు
హైదరాబాద్: ట్రావెల్ బ్యాగ్లో లభించిన మహిళ మృతదేహానికి సంబంధించిన కేసును పోలీసులు 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కె.సురేష్ కుమార్ మహిళ హత్య కేసు వివరాలను వెల్లడించారు. నేపాల్కు చెందిన మహిళ (33), నేపాల్లోని భగ్లంగ్ గ్రామానికి చెందిన గల్కోట్కు చెందిన విజయ్తోఫా అలియాస్ విల్సన్(30) ఫేస్బుక్ ద్వారా స్నేహితులయ్యారు. సదరు మహిళకు గతంలోనే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆమె భర్తను వదిలేసి విజయ్తోఫాతో కలిసి హైదరాబాద్కు వచ్చింది. 40 రోజుల క్రితం భౌరంపేట్లోని ఇందిరమ్మ కాలనీలో ఓ గదిలో అద్దెకుంటూ విజయ్తోఫా ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో మాస్టర్గా పనిచేస్తూ ఆమెతో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్సింది. గర్భం తొలగించుకోవాలని విజయ్తోఫా ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఆమె అంగీకరించకపోవడంతో మే నెల 23న అర్ధరాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. విజయ్తోఫా చున్నీని ఆమె గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు.
ట్రావెల్ బ్యాగ్తో కూపీ లాగితే..
తాము నివాసం ఉంటున్న గదిలోనే శవాన్ని ఉంచి, మే 23న ఉదయం బాచుపల్లిలోని రామ్దేవ్ బ్యాగ్స్టోర్కు వచ్చి పెద్ద సైజులో ఉన్న ట్రావెల్ బ్యాగ్ను కొలుగోలు చేశాడు. అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని ఇంటికి వచ్చాడు. శవాన్ని ట్రావెల్ బ్యాగ్లో పెట్టుకొని హంతకుడే మోసుకుంటూ వచ్చి బాచుపల్లి రెడ్డీ ల్యాబ్స్ ప్రాంతంలోని విజయ్దుర్గా ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో పాడేసి వెళ్లిపోయాడు. జూబ్లీహిల్స్లోని ఓ బస్తీలో గల తన బంధువుల ఇంటి వద్ద ఉంటూ రోజువారీ పనులు చేసుకుంటున్నాడు. జూన్ 4న స్థానికులు మహిళ మృతదేహం ఉన్న ట్రావెల్ బ్యాగ్ను గుర్తించి బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ట్రావెల్ బ్యాగ్లో ఉన్న మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు, ఎస్ఓటీ, సీసీఎస్ పోలీసులతో కలిసి సాంకేతిక ఆధారాలు, ట్రావెల్ బ్యాగ్పై ఉన్న గోల్డెన్ హ్యాండ్ లేబుల్ ఆధారంగా బాచుపల్లిలోని ఓ షాపులో కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్న ఫోన్ నంబరు ద్వారా నిందితుని ఆచూకీని కనుగొన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మహిళను తానే హత్య చేసినట్టు అంగీకరించడంతో విజయ్తోఫాను రిమాండ్కు తరలించినట్టు డీసీపీ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్, విశ్వప్రసాద్, శివకుమార్, బాచుపల్లి సీఐ ఉపేందర్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
Read Latest Telangana News and National News
Updated Date - Jun 07 , 2025 | 07:18 AM