Mumbai Cyber Fraud: ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసిన 80 ఏళ్ల వృద్ధుడికి భారీ షాక్.. దాదాపు రూ.9 కోట్ల నష్టం
ABN, Publish Date - Aug 08 , 2025 | 12:57 PM
సైబర్ నేరం బారిన పడ్డ ఓ ముంబై వృద్ధుడు తన సొమ్మంతా పోగొట్టుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల పాటు సాగిన ఈ స్కామ్లో బాధితుడు ఏకంగా రూ.8.7 కోట్లు పోగొట్టుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇంటర్నెట్ డెస్క్: సైబర్ నిందితుల చేతికి చిక్కిన ఓ వృద్ధుడు భారీ స్థాయిలో డబ్బు కోల్పోయారు. విడతల వారీగా దాదాపు రూ.9 కోట్లు పోగొట్టుకుని చివరకు ఆసుపత్రి పాలయ్యారు. ముంబైలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది.
ఫ్రెండ్ రిక్వెస్ట్తో ఉచ్చులో పడి..
ఓ ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్తో ఈ భారీ సైబర్ స్కామ్ మొదలైంది. తొలుత బాధిత వృద్ధుడు 2023లో సదరు మహిళ శార్వీ అనే మహిళకు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. ఆమెతో ఆయనకు అంతకుముందు ఎలాంటి పరిచయం లేదు. వృద్ధుడి ఫ్రెండ్ రిక్వెస్ట్కు మహిళ కూడా మొదట్లో స్పందించలేదు. కొన్ని రోజుల తరువాత వృద్ధుడికి శార్వీ అకౌంట్ నుంచే ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో ఆయన ఓకే చెప్పారు. ఆ తరువాత ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. చివరకు వారు తమ ఫోన్ నెంబర్లను ఇచ్చి పుచ్చుకునే వరకూ వ్యవహారం వెళ్లింది. తను భర్తతో విడిపోయి పిల్లలతో ఉంటున్నానని శార్వీ బాధితుడితో చెప్పింది.
మెల్లగా ఆయన నమ్మకాన్ని పొందాక ఆమె తన వ్యూహాన్ని అమలు చేసింది. తన పిల్లలకు ఆరోగ్యం బాలేదంటూ వైద్యం పేరిట డబ్బులు వసూలు చేయడం మొదలెట్టింది. ఆమె అడిగిన ప్రతీసారీ వృద్ధుడు డబ్బులు బదిలీ చేశారు. కొన్నాళ్లకు కవిత అనే మరో మహిళ వాట్సాప్ ద్వారా వృద్ధుడికి టచ్లోకి వచ్చింది. తనని తాను శార్వీ ఫ్రెండ్గా పరిచయం చేసుకుంది. ఆ తరువాత వారి మధ్య సంభాషణలు మరింత ముదిరి అసభ్యకర చాటింగ్ వరకూ వెళ్లాయి. ఈ క్రమంలోనే ఆమె కూడా వృద్ధుడి నుంచి డబ్బు తీసుకోవడం మొదలెట్టింది.
ఇక ఆ ఏడాది డిసెంబర్లో దినాజ్ అనే మరో మహిళ తాను శార్వీ సోదరినంటూ వృద్ధుడికి మెసేజీలు పంపించింది. శార్వీ చనిపోయిందని, ఆసుపత్రి బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. ఆమె కోరినట్టే వృద్ధుడు డబ్బు పంపించారు. ఆ తరువాత కొంత కాలానికి తన డబ్బులు వెనక్కు ఇవ్వమని వృద్ధుడు కోరగా తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ దినాజ్ బెదిరింపులకు దిగింది. ఆ తరువాత దినాజ్కు ఫ్రెండ్గా చెప్పుకుంటూ మరో మహిళ సీన్లోకి ఎంట్రీ ఇచ్చి ఆమె ఆయన నుంచి డబ్బులు దండుకుంది. ఇలా రెండేళ్లల్లో వృద్ధుడు రూ.8.7 కోట్లు కోల్పోయారు.
సంపాదించిందంతా ఇలా పోగొట్టుకోవడంతో ఆ వృద్ధుడు చివరకు తన కోడలి వద్ద రూ.2 లక్షలు అప్పు చేసి మరీ మహిళలకు డబ్బులు చెల్లించాడు. ఆ తరువాత మరో సందర్భంలో కొడుకునూ రూ.5 లక్షల అప్పు అడిగాడు. దీంతో, తండ్రిపై తనయుడికి అనుమానం కలిగి ఏం జరిగిందని ప్రశ్నించగా వృద్ధుడు జరిగిన విషయమంతా చెప్పుకొచ్చారు. చివరకు తాను సైబర్ నేరగాళ్ల బారిన పడ్డట్టు గ్రహించి అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు. ఈ ఏడాది జులై 22న ఈ ఘటనపై ఫిర్యాదు దాఖలు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నలుగురు మహిళల పేరిట ఒకే వ్యక్తి ఈ వ్యవహారమంతా నడిపి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వృద్ధుడిని ఇంతలా ఏలా మోసం చేయగలిగారనే కోణంలో విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
25 వీధి కుక్కలను రైఫిల్తో కాల్చి చంపిన నరరూప రాక్షసుడు.. రాజస్థాన్లో దారుణం
సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడ.. పీఎం కిసాన్ యోజన పేరుతో..
Updated Date - Aug 08 , 2025 | 01:14 PM