Hyderabad : అమ్మాయి రిక్వెస్ట్.. 38 లక్షలు హాంఫట్..
ABN, Publish Date - Jun 18 , 2025 | 04:13 PM
హైదరాబాద్కి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి(70) హనీ ట్రాప్కు గురయ్యారు. ఫేస్ బుక్లో మహిళ పేరుతో చాటింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు అతడి నుండి ఏకంగా 38.73లక్షలు కాజేశారు.
హైదరాబాద్: సోషల్ మీడియాలో హనీ ట్రాప్ మోసాలు కొత్తేమీ కావు. సైబర్ నేరగాళ్ళు ఫేస్ బుక్లో అమ్మాయిల పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపి డబ్బు కాజేసిన ఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా, హైదరాబాద్కి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి(70) ఒకరు హనీ ట్రాప్కు గురయ్యారు. ఫేస్ బుక్లో మహిళ పేరుతో చాటింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు అతడి నుండి ఏకంగా 38.73లక్షలు కాజేశారు. అసలేం జరిగిందంటే..
ఒక మహిళ పేరు మీద బాధితుడుకి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడనీ, తల్లి టైలర్గా పని చేస్తోందనీ చెప్పి సానుభూతి కలిగించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు చాటింగ్ చేసేందకు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని మహిళ ఒక కేబుల్ ఆపరేటర్ నంబర్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన కేబుల్ ఆపరేటర్ నంబర్తో ఆ వృద్ధుడు మాట్లాడి రూ. 10వేలు పంపాడు. అనంతరం మహిళ నుంచి ఫేస్ బుక్ లో ఎలాంటి స్పందన లేకపోవడంతో కేబుల్ ఆపరేటర్తో బాధితుడు చాటింగ్ చేశాడు. అయితే, సదరు మహిళ జబ్బు పడిందని.. ఆస్పత్రిలో ఉందని చెప్పడంతో వృద్దుడు రూ. 10లక్షలు పంపాడు . అనంతరం క్రెడిట్ కార్డు నుంచి మరో 2.65లక్షలు చెల్లించాడు. అయితే, కొన్ని రోజుల తర్వత ఆ మహిళ దుబాయ్ వెళ్ళిపోయిందని.. ఆమె కాంటాక్ట్స్ ఏమీ లేవని కేబుల్ ఆపరేటర్ చెప్పాడు.
ఈ క్రమంలోనే తన తల్లి, సోదరి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని కేబుల్ ఆపరేటర్ చెప్పగా సరే అన్న వృద్దుడు కొద్ది రోజుల పాటు తల్లి, సోదరితో లైంగికంగా చాటింగ్ చేశాడు. దీంతో తన తల్లి, మైనర్ చెల్లితో చాటింగ్ చేశావని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కేబుల్ ఆపరేటర్ బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత మరో వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ పేరుతో బాధితుడికి ఫోన్ చేసి ఈ మ్యాటర్ సెటిల్ చేయాలంటే డబ్బు కట్టాలని చెప్పాడు. దీంతో బాలిక చదువు, తల్లి డ్వాక్రా రుణం చెల్లింపు నిమిత్తం మొత్తం రూ. 12.5 లక్షలు చెల్లించాడు. సెటిల్ చేసిన కానిస్టేబుల్, ఎస్సైకి లక్ష సమర్పించుకున్నాడు. అయితే, మళ్లీ కొత్త ఎస్సై వచ్చాడని..కేసు అవ్వకుండా ఉండాలంటే రూ. 10లక్షలు ఇవ్వాలని మరో వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో మరో ఏడు లక్షల పంపించాడు ఆ వృద్దుడు. ఇలా అంతా డబ్బు పోయాకే వృద్ధుడికి అసలు విషయం అర్థమైంది. తాను మోసపోయినట్లు గుర్తించాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. మొత్తం రూ.38.73 లక్షలు మోసపోయాడు.
Also Read:
అగ్నిపర్వతం బద్దలవడంతో వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం
రాజా హత్యకేసులో వెలుగుచూసిన మరో కొత్తపేరు
For More Telugu News
Updated Date - Jun 18 , 2025 | 04:51 PM