SEBI Report: డెరివేటింగ్ ట్రేడింగ్లో 91% మందికి నష్టాలే
ABN, Publish Date - Jul 08 , 2025 | 03:43 AM
గత ఆర్థిక సంవత్సరం 2024 25 ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్లో దాదాపు 91 శాతం మంది వ్యక్తిగత మదుపరులు నష్టాలే చవిచూశారు.
సెబీ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్లో దాదాపు 91 శాతం మంది వ్యక్తిగత మదుపరులు నష్టాలే చవిచూశారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2023-24)లోనూ ఇదే జరిగిందని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సోమవారం విడుదల చేసిన అధ్యయన నివేదికలో వెల్లడించింది. 2023-24లో వ్యక్తిగత మదుపరులు ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్లో రూ.74,812 కోట్ల వరకు నష్టపోగా.. 2024-25లో నష్టాలు మరో 41 శాతం పెరిగి రూ.1,05,603 కోట్లకు చేరాయని సెబీ తాజా నివేదిక తెలిపింది. అంతేకాదు, 2023-24తో పోలిస్తే, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ)లో ట్రేడింగ్ నెరిపే వ్యక్తిగత మదుపరుల సంఖ్య కూడా 20 శాతం తగ్గిందని నివేదిక పేర్కొంది. రెండేళ్ల క్రితం మాత్రం ట్రేడర్ల సంఖ్య 24 శాతం పెరిగింది. ఈక్విటీ ఇండెక్స్ డెరివేటివ్ ట్రేడింగ్ నియమావళిని బలోపేతం చేసేందుకు 2024 అక్టోబరు 1న చర్యలు చేపట్టిన అనంతరం సెబీ ఈ అధ్యయనం జరిపింది. అన్ని విభాగాల ఇన్వెసర్లను విశ్లేషించిన నియంత్రణ మండలి.. గత ఏడాది డిసెంబరు నుంచి 2025 మే మధ్యలో వ్యక్తిగత మదుపరుల ట్రేడింగ్పైన మాత్రం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఆ విశ్లేషణలో దాదాపు 91 శాతం మంది వ్యక్తిగత ఇన్వెస్టర్లు ఈక్విటీ డెరివేటివ్ల్లో నష్టపోయారని తేలింది. సమీక్షా కాలంలో ఇండెక్స్ ఆప్షన్స్ టర్నోవర్ వార్షిక ప్రాతిపదికన ప్రీమియం టర్మ్స్లో 9 శాతం, నోషనల్ టర్మ్స్లో 29 శాతం తగ్గింది.
రెండేళ్ల క్రితంతో పోలిస్తే మాత్రం ఇండెక్స్ ఆప్షన్స్ లావాదేవీలు మాత్రం ప్రీమియం టర్మ్స్లో 14 శాతం, నోషనల్ టర్మ్స్లో 42 శాతం పెరిగింది. ఈక్విటీ డెరివేటివ్ విభాగంలో వ్యక్తిగత మదుపరుల టర్నోవర్ ప్రీమియం టర్మ్స్లో 11 శాతం తగ్గిందని సెబీ విశ్లేషణలో వెల్లడైంది. ఒడుదుడుకులున్నప్పటికీ, ఈక్విటీ డెరివేటివ్స్లో, ముఖ్యంగా ఇండెక్స్ ఆప్షన్స్లో ట్రేడింగ్ భారీగానే జరుగుతోందని సెబీ గుర్తించింది.
డెరివేటివ్ ట్రేడింగ్పై మరింత నిఘా
డెరివేటింగ్ ట్రేడింగ్ మార్కెట్పై నిఘా పెంచనున్నట్లు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే సోమవారం తెలిపారు. నియంత్రణాధికారాల కంటే మెరుగైన నిఘా, నిబంధనల అమలు ద్వారానే తప్పు చేసినవారిపై చర్యలు చేపట్టగలమన్నారు. నిఘా పెట్టడం వల్లే జేన్ స్ట్రీట్పై చర్యలు తీసుకోగలిగామని.. నియంత్రణ మండలితో పాటు ఎక్స్ఛేంజీలు ఈ విభాగ ట్రేడింగ్పై నిఘా పెంచనున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, జేన్ స్ట్రీట్ మోసపూరిత ట్రేడింగ్ వ్యూహాల తరహాలో మార్కెట్లో ఇతర రిస్క్లేమీ కన్పించడం లేదని పాండే అన్నారు. డెరివేటివ్ ట్రేడింగ్లో అక్రమ పద్ధతుల్లో వేల కోట్ల రూపాయలు ఆర్జించిన అమెరికా ట్రేడింగ్ కంపెనీ జేన్ స్ట్రీట్ గ్రూప్ను సెక్యూరిటీ మార్కెట్ నుంచి నిషేధిస్తూ సెబీ గత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, రూ.4,843 కోట్ల అక్రమ లాభాలను తిరిగి తమ ఎస్ర్కో ఖాతాలో జమ చేయాలని నియంత్రణ మండలి ఆదేశించింది.
Updated Date - Jul 08 , 2025 | 05:44 AM