Vijayawada: విజయవాడలో పట్టుబడ్డిన విదేశీయులు.. అసలు గుట్టు ఇదే
ABN, Publish Date - May 23 , 2025 | 11:54 AM
విజయవాడలో నగర పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 15 మంది యువకులను వారు అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడ, మే 23: పెనమలూరు మండలం కానూరు, తాడిగడపలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్, మయన్మార్కు చెందిన 15 మంది యువకులను గుర్తించారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఏడుగురు యువకులు ఇటీవల హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో వారందరినీ స్వదేశాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అదీకాక ఇటీవల శరణార్థులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి అనంతరం రాష్ట్రాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించాలని.. అలాగే ఇతర దేశాలకు చెందిన వారిని గుర్తించి.. స్వదేశాలకు పంపించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. అందులో భాగంగా విదేశీయులను గుర్తించి వారి సమాచారాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపుతున్నారు. అనంతరం వారిని స్వదేశాలకు పంపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, శ్రీలంకకు చెందిన వ్యక్తి తనకు భారత్లో ఆశ్రయం కల్పించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. శ్రీలంక వెళ్లితే తన ప్రాణాలకు ముప్పు ఉందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్లో స్పష్టం చేశాడు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి.. విదేశీయులకు ఆశ్రయం కల్పించడానికి భారత్ ఏమీ ధర్మశాల కాదని స్ఫష్టం చేసింది. ఆశ్రయం పొందడానికి మరో దేశం వెళ్లాలంటూ సదరు శ్రీలంక వ్యక్తికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 23 , 2025 | 12:21 PM