Revenue Department: అర్హత లేకున్నా తహశీల్దార్గా
ABN, Publish Date - Apr 29 , 2025 | 03:48 AM
ప్రభుత్వం, రెవెన్యూశాఖలో అనుభవంలేని వ్యక్తులను తహశీల్దార్లుగా నియమించడంతో పలుమార్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని జిల్లాల్లో రీ సర్వే డీటీలను అడహాక్ తహశీల్దార్లుగా నియమించడం, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం చర్చనీయాంశమైంది.
రెవెన్యూ, భూ చట్టాలపై అవగాహన లేకున్నా నియామకాలు
రీ సర్వే డీటీలకు అడహాక్ తహశీల్దార్లుగా బాధ్యతలు
రెవెన్యూలో మళ్లీ మళ్లీ అవే తప్పులు
కోర్టు ఆదే శాలను ఉల్లంఘించి మరీ నియామకాలు
ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రెవెన్యూశాఖ తీరు మారడం లేదు. ఏ మాత్రం పాలనా అనుభవంలేనివారిని, రెవెన్యూ, భూముల చట్టాలపై కనీసం అవగాహనలేనివారిని తీసుకొచ్చి మండల తహశీల్దార్లుగా నియమిస్తోంది. కూటమి సర్కారు వచ్చిన కొత్తలో ఒకేదఫా 280 మందికి ఆ అవకాశం కల్పించగా అది పెద్ద తప్పని తేలింది. మరోసారి ఇలాంటివి పునరావృతం కానివ్వబోమని చెప్పిన రెవెన్యూశాఖ ఆచరణలో మాత్రం మళ్లీ మళ్లీ అదే తప్పులను చేస్తోంది. తాజాగా ఐదు జిల్లాల పరిధిలో రీ సర్వే డీటీలుగా పనిచేస్తోన్న సీనియర్ అసిస్టెంట్లలో కొందరికి ఏరికోరి తహశీల్దార్లుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయా జిల్లాల పరిధిలో రెగ్యులర్ రెవెన్యూ డీటీలు ఉన్నా వారిని పక్కనపెట్టి, ఏమాత్రం అనుభవం, అవగాహన లేని రీ సర్వేలోని అధికారులను అడహాక్ తహశీల్దార్లుగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో 679 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలానికీ తహశీల్దార్ ఉండాలి. మండల మేజిస్ట్రేట్ బాధ్యతలు కూడా ఆ పోస్టుకు ఉన్నాయి. సిబ్బంది కొరత వల్ల కేవలం 399 మండలాల్లోనే రెగ్యులర్ తహశీల్దార్లు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రెవెన్యూలోనే డిప్యూటీ తహశీల్దార్(రెవెన్యూ డీటీ)లను ఇన్చార్జి తహశీల్దార్లుగా నియమిస్తుంటారు. అయితే, అధికారిక లెక్కల ప్రకారం 120 మంది రెవెన్యూ డీటీలే ఆ పోస్టుల్లో ఉన్నారు. మిగిలిన 160 మండలాలకు రీ సర్వే డీటీలుగా ఉన్న సీనియర్ అసిస్టెంట్లే అడహాక్ తహశీల్దార్లుగా కొనసాగుతున్నారు. కొందరు అధికారులు వీరిని ఏరికోరి ఆ పోస్టుల్లో కూర్చోబెట్టారు.ఇటీవల రీ సర్వే డీటీల సమావేశంలో వారి పనితీరుపై సీసీఎల్ఏ జయలక్ష్మి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రీ సర్వేపని సరిగ్గా సాగడం లేదని, రైతుల పిటిషన్లను సరిగ్గా పరిష్కరించడం లేదని మండిపడ్డారు. పనిచేయని వారిని సస్పెండ్ చేస్తానని కూడా హెచ్చరించారు.
ప్రస్తుతం 650 మండలాల్లో రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుగా నడుస్తోంది. అంటే, ప్రతి మండలంలో రీ సర్వే డీటీ సేవలు తప్పనిసరి. ఈ విషయం తెలిసి కూడా కొందరు కలెక్టర్లు రీ సర్వే డీటీలుగా ఉన్న వారిని ఏరికోరి మండలాలకు అడహాక్ తహశీల్దార్లుగా నియమిస్తున్నారు. ఇంకా కొందరు కలెక్టరేట్ల పరిధిలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న వారిని తహశీల్దార్గా నియమిస్తున్నారు. ఇటీవలి శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు సూపరింటెండెంట్లకు తహశీల్దార్లుగా పోస్టులు ఇచ్చారు. కోర్టు ఆదే శాలను ఉల్లంఘించి మరీ ఈ తరహా నియామకాలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. పార్వతీపురం మన్యంలో ఓ రీ సర్వే అధికారిని నిబంధనలకు విరుద్ధంగా అడహాక్ తహశీల్దార్గా నియమించినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. అనంతపురం జిల్లాలో ఓ డీటీకి వజ్రకరూరు, విడపనకల్లు మండలాలను అప్పగించారు. ఇలా ఆరు జిల్లాల్లో 18 మంది డీటీలకు సగటున రెండు మండలాల బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
Updated Date - Apr 29 , 2025 | 03:52 AM