AP liquor scam: వారిద్దరికీ వ్యతిరేకంగా సాక్ష్యాలు
ABN, Publish Date - May 17 , 2025 | 03:40 AM
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, వారిపై బలమైన సాక్ష్యాలు ఉన్నట్లు అభిప్రాయపడింది.
వారిపై తీవ్ర అభియోగాలు.. కీలక దశలో విచారణ.. ముందస్తు
బెయిలిస్తే దర్యాప్తు అధికారి చేతులు కట్టేసినట్లే: బెంచ్ వ్యాఖ్య
ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డికి సుప్రీం షాక్.. పిటిషన్ డిస్మిస్
ఖజానాకు రూ.3 వేల కోట్లకు పైగా నష్టం.. ముందస్తు బెయిలిస్తే
కేసుపై ప్రభావం.. హైకోర్టు అన్నీ పరిశీలించే నిరాకరించింది
ఏపీ ప్రభుత్వ వాదన.. థర్ ్డ డిగ్రీ ప్రయోగించొద్దని కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, మే 16 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో మద్యం కుంభకోణం కేసులో సీఎంవో మాజీ కార్యదర్శి కె.ధనుంజయ్రెడ్డి, మాజీ సీఎం ఓఎ్సడీ కృష్ణమోహన్రెడ్డిలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఈ స్కాంలో వారిద్దరికీ వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నట్లు అర్థమవుతోందని స్పష్టం చేసింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందన ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. వారి పిటిషన్లను కొట్టివేసింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్రెడ్డి (ఏ-31), కృష్ణమోహన్రెడ్డి (ఏ-32), భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప (ఏ-33) నిందితులుగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోరుతూ ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు నిరాకరించింది. ఆ తీర్పును వారిద్దరూ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూథ్రా, సిద్దార్థ్ అగర్వాల్.. కృష్ణమోహన్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ధనుంజయ్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్, బాలాజీ గోవిందప్ప తరపున సీనియర్ న్యాయవాది సిదాఽ్ధర్థ్ దవే వాదనలు వినిపించారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ నేతలు, అధికారులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సింఘ్వీ అన్నారు. నిందితులు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నారని, ప్రభుత్వం రాజకీయ పక్షపాత ధోరణితో అసత్య కేసులు పెట్టిందని తెలిపారు. నిందితులు మద్యం వ్యాపారాన్ని ఉద్దేశపూర్వకంగానే కొందరికి కట్టబెట్టారని చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఈ కేసు ఇప్పటికే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వరకు వెళ్లిందని, అక్కడ మూసివేశారని గుర్తుచేశారు. సింఘ్వీ వాదనలపై రోహత్గీ అభ్యంతరం తెలిపారు. దర్యాప్తు కీలక దశలో ఉందని.. ఈ సమయంలో ముందస్తు బెయిల్ ఇస్తే కేసుపై ప్రభావం పడుతుందని తెలిపారు. జరిగింది అతిపెద్ద కుంభకోణమని, ఖజానాకు రూ.3 వేల కోట్లకు పైగా నష్టం కలిగిందన్నారు. హైకోర్టు సుదీర్ఘంగా విచారించిందని.. అన్నీ పరిశీలించాకే ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిందని తెలిపారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేయాలని.. నిందితులను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందన్నారు. వారిద్దరికీ వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నట్లు సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. ‘నిందితులపై మోపిన అభియోగాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. హైకోర్టు అన్నింటినీ స్పష్టంగా పరిశీలించి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిందని నమ్ముతున్నాం. ఈ సమయంలో దర్యాప్తు సంస్థకు అడ్డురాకూడదని భావిస్తున్నాం. రాజకీయ పక్షపాతం, దురుద్దేశం ఉందనే వాదనలను పక్కన పెడితే.. ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నట్లు ప్రాథమికంగా అనిపిస్తోంది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని అర్థమవుతోంది. ఈ సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వడం సరికాదని అభిప్రాయపడుతున్నాం. అయితే వారిపై ఎటువంటి థర్డ్ డిగ్రీ పద్ధతులను ప్రయోగించకూడదు. దర్యాప్తు సంస్థ చట్టానికి అనుగుణంగా నిష్పక్షపాతంగా విచారణ కొనసాగించాలి. వారు కూడా సాక్షులు లేదా సహనిందితులపై ఎటువంటి ఒత్తిడీ చేయకూడదు’ అని ఽస్పష్టం చేసింది. నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపితే.. వారి బెయిల్ దరఖాస్తులను మెరిట్స్ ఆధారంగా సంబంధిత కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది. పిటిషనర్లు అవసరమని భావిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చనీ స్పష్టం చేసింది.
బాలాజీ గోవిందప్పను కస్డడీకి అప్పగించండి..
మద్యం కేసులో మరో నిందితుడు బాలాజీ గోవిందప్పను పోలీసు కస్టడీకి అప్పగించాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపిన తర్వాత తిరిగి మళ్లీ పోలీసు కస్టడీకి ఎలా తీసుకుంటారని జస్టిస్ పార్దీవాలా ప్రశ్నించారు. ఆయన్ను పోలీసు కస్టడీకి ఇస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అగర్వాల్ చెబుతుండగా.. జస్టిస్ పార్దీవాలా అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ కేసులో బాలాజీ గోవిందప్పను ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు మాకు సమాచారం అందింది. ఆ సందర్భంగా దర్యాప్తు అధికారి పోలీసు కస్టడీ కోసం ప్రార్థించలేదు. జ్యుడీషియల్ కస్టడీకి పంపాక.. కస్టడీ కోరుతూ దరఖాస్తు చేశారు. ఈ విషయంలో మేమేమీ చెప్పడం లేదు. ఎందుకంటే నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపాక.. దర్యాప్తు అధికారి పోలీసు రిమాండ్ కోసం అడగవచ్చా లేదా అనేది సంబంధిత కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేస్తే.. చట్టానికి అనుగుణంగా బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది’ అని జస్టిస్ పార్దీవాలా తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News
Updated Date - May 17 , 2025 | 03:40 AM