AP Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..
ABN, Publish Date - Jun 30 , 2025 | 06:28 PM
ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చెవిరెడ్డి భాస్కరరెడ్డితోపాటు ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడును సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ, జూన్ 30: జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేష్ నాయుడులను మూడు రోజులపాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే తమకు ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును సిట్ కోరింది. కానీ వీరిని విచారించేందుకు మూడు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో జులై 1 నుంచి 3వ తేదీ వరకు వీరిద్దరిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు వీరిని విచారించాలని ఆ ఆదేశాల్లో న్యాయమూర్తి స్పష్టం చేశారు.
మరోవైపు ఇదే లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. అతడు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఏ 39గా మోహిత్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఇంకోవైపు జైలు ప్రాంగణంలోని ఆలయానికి ప్రతి రోజు 10 నిమిషాలు వెళ్లేందుకు చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే జైల్లో ఉన్న తనకు బయట ఆహారం పంపాలంటూ చెవిరెడ్డి చేసుకున్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అలాగే వారంలో మూడు సార్లు ములాఖత్లకు చెవిరెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.
Updated Date - Jun 30 , 2025 | 06:31 PM