Former ADG of CID : ‘తులసి’కి సంతర్పణ!
ABN, Publish Date - Jan 20 , 2025 | 03:21 AM
ప్రతి ప్రభుత్వ శాఖకు ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోని డాష్బోర్డులో ఆ శాఖ అధికారుల వివరాలు, ఆ శాఖ నుంచి ప్రజలకు ఎలాంటి పథకాలు అందుతున్నాయో...
రూ.10 లక్షల పనికి 3.06 కోట్లు సమర్పయామి
సీఐడీ మాజీ ఏడీజీ పీవీ సునీల్కుమార్ నిర్వాకం
పోలీసు గృహనిర్మాణ సంస్థ డ్యాష్బోర్డులో చేతివాటం
టెండరు ఖరారు నుంచే నిబంధనలకు తిలోదకాలు
రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో
నిందితుడు తులసిబాబు కంపెనీకి చెల్లింపులు
ఇప్పటికీ అతీగతీ లేని డ్యాష్బోర్డు
వైసీపీ హయాంలో పలు అక్రమాలకు పాల్పడిన సీఐడీ మాజీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్ అవినీతి బాగోతం మరొకటి తాజాగా వెలుగు చూసింది. పోలీసు గృహ నిర్మాణ సంస్థకు డ్యాష్బోర్డు రూపకల్పన పేరిట ప్రభుత్వ ఖజానా నుంచి రూ.కోట్ల సొమ్మును తన అనుచరుడికి అప్పనంగా దోచిపెట్టినట్లు తేలడం కలకలం రేపుతోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబే ఆ అనుచరుడు కావడం గమనార్హం.
(ఆంధ్రజ్యోతి-విజయవాడ)
ప్రతి ప్రభుత్వ శాఖకు ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోని డాష్బోర్డులో ఆ శాఖ అధికారుల వివరాలు, ఆ శాఖ నుంచి ప్రజలకు ఎలాంటి పథకాలు అందుతున్నాయో, వాటి లక్ష్యాలు ఏమిటో పొందుపరుస్తారు. ఆయా శాఖలు ఐటీ కంపెనీలతో ఈ సైట్లను తయారు చేయిస్తుంటాయి. కొన్ని శాఖలు ఆ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలను తయారు చేసిన కంపెనీకే అప్పగిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియకు ఏడాదికయ్యే ఖర్చు రూ.లక్షల్లోనే ఉంటుంది. అయితే జగన్ ప్రభుత్వంలో సీఐడీ అదనపు డీజీగా వ్యవహరించిన పీవీ సునీల్కుమార్ రూటే వేరు! అప్పట్లో ఆయన పోలీసు గృహ నిర్మాణ సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గానూ కొంతకాలం కొనసాగారు. ఆ సమయంలో ఈ సంస్థకు సరికొత్త డాష్బోర్డును సిద్ధం చేయించాలని నిర్ణయించారు. దీనికి క్లౌడ్ బేస్ వెబ్ అండ్ మొబైల్ టెక్నాలజీ అని నామకరణం కూడా చేశారు. దీనికోసం ఈ-టెండర్లను ఆహ్వానిస్తూ 2019 జనవరి 30న నోటిఫికేషన్ విడుదల చేశారు. టెండర్లు ఖరారు చేయడానికి నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
డాష్బోర్డు కోసం రూ.1.69 కోట్లు, మొదటి ఏడాది నిర్వహణకు రూ.33.80 లక్షలు, జీఎస్టీ 18శాతం కింద మరో రూ.36,50,400, మరో రెండేళ్ల పాటు వార్షిక నిర్వహణను పొడిగింపునకు రూ.33.80 లక్షలు చొప్పున మొత్తం రూ.3,06,90,400 చెల్లించాలని నిర్ణయించారు.
ఇద్దరితోనే టెండర్ల ఖరారు
ఎంత పెద్ద ప్రాజెక్టయినా, చెల్లించే మొత్తం ఎంత చిన్నదైనా ఒకసారి టెండర్ ప్రకటన వెలువడిన తర్వాత అందులో కనీసం మూడు టెండర్లు కచ్చితంగా దాఖలు కావాలి. లేదంటే ఆ టెండర్లు రద్దుచేసి మళ్లీ కొత్తగా ప్రకటన ఇవ్వాలి. ఇక్కడే సునీల్కుమార్ తన సొంత నిబంధనలను అమలు చేశారు. పోలీసు గృహనిర్మాణ సంస్థ ఆహ్వానించిన టెండర్లలో రెండు సంస్థలే పాల్గొన్నాయి. అందులో ఒకటి మెగట్రాన్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, రెండోది వీఎ్సఎన్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో వీఎ్సఎన్ సంస్థకు అర్హత లేదని కమిటీ తేల్చింది. రఘురామరాజును వేధించిన కేసులో నిందితుడిగా ప్రస్తుతం రిమాండ్లో ఉన్న కామేపల్లి తులసిబాబుకు చెందిన మెగట్రాన్ కంపెనీకి అన్ని అర్హతలు ఉన్నట్టు నిర్ధారించి ఎంపిక చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఈ డాష్బోర్డును నిర్వహించిన దాఖలాలు లేవు. టెండర్ ఖరారు చేయగానే మెగట్రాన్ కంపెనీకి రూ.3.06 కోట్లు సునీల్ ఏకమొత్తంలో చెల్లించారు. ఇదిప్పుడు పోలీసు శాఖలో పెనుదుమారం రేపుతోంది. వాస్తవానికి డాష్బోర్డు తయారీ, నిర్వహణ ఖర్చు ఏడాదికి రూ.10 లక్షలకు మించదని ఐటీ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. కానీ దానికి రూ.3.06 కోట్లు చెల్లించడం, ప్రాజెక్టును దక్కించుకున్న సంస్థ ఐదేళ్ల కాలంలో దాన్ని పూర్తిచేయకపోవడం వంటి అంశాలు వివాదాస్పదమవుతున్నాయి.
Updated Date - Jan 20 , 2025 | 03:21 AM