K. Vijayanand: అవుకు పీఎస్పీ అనుమతులు రద్దు
ABN, Publish Date - Jul 01 , 2025 | 06:12 AM
అవుకులో 800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్కేంద్రం పీఎస్పి నిర్మాణానికి ఆరో ఇన్ఫ్రా సంస్థకు ఇచ్చిన అనుమతులను రాష్ట్ర ఇంధన శాఖ రద్దు చేసింది.
అమరావతి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): అవుకులో 800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్కేంద్రం (పీఎస్పి) నిర్మాణానికి ‘ఆరో’ ఇన్ఫ్రా సంస్థకు ఇచ్చిన అనుమతులను రాష్ట్ర ఇంధన శాఖ రద్దు చేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేయడంలో తీవ్రజాప్యం నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ఆర్ఈడీక్యాప్) సిఫారసు చేసింది. జాప్యానికి కారణాలు వివరించాలంటూ ‘ఆరో’ సంస్థకు నోటీసులు పంపినా ఫలితం లేకపోయింది. ఇంకోవైపు.. ప్రాజెక్టు నిర్మాణంలో అధిక ఆలస్యం జరుగుతుండడంతో అనుమతులు రద్దు చేస్తూ ఇంధనశాఖ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వు జారీ చేశారు.
కాగా, కడప జిల్లా కమలాపురం మండలం కొప్పోలులో చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 360 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్కేంద్రాన్ని స్థాపించేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులిస్తూ ఇంధన శాఖ ఉత్తర్వు జారీ చేసింది. అలాగే కడప జిల్లా గండికోట వద్ద అదానీ సంస్థ చేపట్టదలచిన 1,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్కేంద్రం సామర్థ్యాన్ని 1,800 మెగావాట్లకు పెంచేందుకూ సమ్మతిస్తూ ఆదేశాలిచ్చింది.
Updated Date - Jul 01 , 2025 | 06:14 AM