Minister Nimmala: సీఎం నిర్దేశించినా అలసత్వమా
ABN, Publish Date - Apr 17 , 2025 | 05:32 AM
వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో అలసత్వం ప్రదర్శించారంటూ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పని వేగం పెంచి 2026 జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా నిర్దేశించారు.
వెలిగొండ ప్రాజెక్టు సమీక్షలో అధికారులు, కాంట్రాక్టు సంస్థపై మంత్రి నిమ్మల ఆగ్రహం
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): లక్ష్యానికి అనుగుణంగా వెలిగొండ పనులు పూర్తి చేయకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ కాంట్రాక్టు సంస్థ, ఇంజనీరింగ్ అధికారులపై మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష జరిపారు. ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు. ‘ఈ నెలలో 432 మీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. కాని, కేవలం 72 మీటర్లు మాత్రమే చేశారు. 2026 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. ఆలోగా పనులు పూర్తిచేసేలా వేగాన్ని పెంచాలి. టన్నెల్-2లో చిక్కుకున్న బోరింగ్ మిషన్(టీబీఎం)ను తొలగించడానికి, దాని విలువ నిర్ధారించడానికి కమిటీని వేస్తున్నాం. కోర్టు ఆదేశాలు ప్రకారం టీబీఎం తొలగింపు సాధ్యం కాకపోతే దానికి సమాంతరంగా మరో టన్నెల్ తవ్వకానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. వెలిగొండ ప్యాకేజీ-2, ప్యాకేజీ-4 కీలక పనుల కోసం రూ.106.39 కోట్లను కేబినెట్ ఆమోదించింది. ఫీడర్ కెనాల్, తీగలేరు కాలువ హెడ్ వర్క్స్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులు కాంట్రాక్టు సంస్థకు అప్పగించేందుకూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది’ అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 05:50 AM