Nara Lokesh: పార్టీ అండగా ఉంటుంది
ABN, Publish Date - May 16 , 2025 | 05:38 AM
టీడీపీ నేత వీరయ్య చౌదరి కుటుంబాన్ని మంత్రి లోకేశ్ పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హత్యకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన స్పష్టం చేశారు.
వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్
ఒంగోలు, మే 15(ఆంధ్రజ్యోతి): ఇటీవల దారుణ హత్యకు గురైన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ గురువారం పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉదయం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ చేరుకున్న లోకేశ్.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వీరయ్య స్వగ్రామం అమ్మనబ్రోలు వెళ్లారు. వీరయ్యకు నివాళులర్పించి, ఆయన భార్య, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘వీరయ్య దారుణ హత్య తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. హత్యకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేసి, లోతుగా దర్యాప్తు చేస్తున్నారు’ అని చెప్పిన లోకేశ్.. యువగళంలో తనతోపాటు కలిసి వీరయ్య నడిచారని గుర్తుచేసుకున్నారు. కాగా లోకేశ్ రాక నేపథ్యంలో టీడీపీ శ్రేణులు, వీరయ్య అభిమానులు భారీగా తరలివచ్చారు. వీరయ్య హత్యలో అసలు దోషులు తప్పించుకున్నారని, వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.
Updated Date - May 16 , 2025 | 05:42 AM