SIT Investigation: లిక్కర్ స్కాంలో దిలీప్ త్రిపాత్రాభినయం
ABN, Publish Date - May 06 , 2025 | 04:25 AM
జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 3.5 వేల కోట్ల విలువైన లిక్కర్ స్కాంలో దిలీప్ కీలక పాత్ర పోషించాడు. సిట్ విచారణలో దిలీప్ కమిషన్లు, ఆర్డర్లు, మనీలాండరింగ్లో పాల్గొన్నట్లు వెల్లడైంది.
కమీషన్లు, ఆర్డర్లు, మనీలాండరింగ్ మూడింట్లోనూ చక్రం తిప్పారు: సిట్
రాజ్ కసిరెడ్డి కలెక్షన్ టీమ్కు కెప్టెన్ ఈయనే
విదేశాలకు పారిపోతుంటే అరెస్టు చేశాం
తదుపరి దర్యాప్తు కోసం ఆయన్ను పూర్తిస్థాయిలో విచారించాలి
ఈ స్కాం విలువ ఇప్పటికి 3.5 వేల కోట్లు
రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడి
అమరావతి, మే5 (ఆంధ్రజ్యోతి): జగన్ జమానాలో చోటుచేసుకున్న రూ.వేల కోట్ల విలువైన అతిపెద్ద మద్యం కుంభకోణం కేసులో పైలా దిలీప్ ప్రధాన పాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొంది. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి ముఖ్య అనుచరుడైన ఈయన ఈ వ్యవహారంలో త్రిపాత్రాభినయం చేసినట్లు తెలిపింది. డిస్టిలరీస్లో ఎవరెవరు కమీషన్లు ఇచ్చారో రాజ్ కసిరెడ్డికి వివరాలు పంపి.. ఆయన సూచన మేరకు తర్వాతి వారంలో ఆర్డర్లు ఇచ్చేలా డిపోలను సైతం ఎలా మేనేజ్ చేశారు.. ఆ మొత్తాన్ని ఎలా మనీలాండరింగ్ చేశారో సంచలన వివరాలను కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వివరించింది. రాజ్ కసిరెడ్డి సూచన మేరకు ఎవరెవరికి మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వాలో.. ఎంత ఇవ్వాలో.. ఎవరికి తిరస్కరించాలో దిలీప్ నిర్ణయించేవారని స్పష్టం చేసింది. ‘2019-24 మధ్య అమలైన మద్యం కుంభకోణంలో డిస్టిలరీస్ నుంచి కమీషన్లు వసూలు చేసిన బృందానికి దిలీప్ కెప్టెన్గా వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలపై పూర్తి నియంత్రణ పొందేందుకు ప్రభుత్వ అధికారులు, వైసీపీ నేతలు, లిక్కర్ వ్యాపారుల సమ్మతితో ఏర్పడిన లిక్కర్ మాఫియాలో కీలక వ్యక్తి. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్(ఏపీఎ్సబీసీఎల్)పై పెత్తనం చెలాయించేలా ఒక ముఠాను ఏర్పాటు చేసి నాయకత్వం వహించారు. కమీషన్లు ఇచ్చిన వారికి సరఫరా ఆర్డర్లు, ఇవ్వని వారికి ఛీత్కారాల వెనుక ఉన్నది ఈయనే. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన దిలీప్.. తాను ఏది చెబితే అది వినే రాజ్ కసిరెడ్డి(ఏ-1) నమ్మకాన్ని ఎప్పటికప్పుడు చూరగొంటూ బాగా దగ్గరయ్యారు.
కమీషన్ల రూపంలో రూ.కోట్లు వసూలు చేయడమే గాక.. ముడుపులు తీసుకుని ఖరీదైన స్థిరాస్తులు, విదేశీ కార్లు కొనుగోలు చేశారు. మద్యం సరఫరాదారుల నుంచి లంచాలు డీల్ చేయడంలో ఈయన ముం దుండే వారని ఈ కేసులో మూడో నిందితుడైన ఏపీఎస్బీసీఎల్ ప్రత్యేక అధికారి డీవీ సత్యప్రసాద్ వాంగ్మూలం ఇచ్చారు. బూనేటి చాణక్య(ఏ8), తాటిపర్తి కిరణ్ కుమార్ రెడ్డి(ఏ9)తో కలిసి దిలీప్ డిస్టిలరీల యజమానుల నుంచి కమీషన్లు వసూలు చేసేవారు. సదరు డిస్టిలరీల యజమానులు ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం.. దిలీప్ ఏర్పాటు చేసిన బృందం కమీషన్లను నగదు రూపంలో సేకరించి.. ఆ సొమ్మంతా మూడో కంటికి తెలియకుండా వివిధ మార్గాల్లో ఓ కేంద్రానికి తరలించారు. ఇప్పటి వరకూ తేలిన లిక్కర్ స్కాం విలువ రూ.మూడున్నర వేల కోట్లు. దిలీప్ విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేయగా.. చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశాం. ఈ కుట్రలో ఇతర నిందితులను కూడా అరెస్టు చేయాల్సి ఉంది’ అని సిట్ రిపోర్టులో వివరించింది.
Updated Date - May 06 , 2025 | 04:26 AM