Anil Kumar Yadav: అనిల్ అనుచరుల ఖాతాల్లో వందల కోట్ల లావాదేవీలు!
ABN, Publish Date - Jul 24 , 2025 | 03:14 AM
మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ క్వార్జ్ట్ అక్రమ తవ్వకం, అమ్మకాల కథంతా తన అనుచరుల ద్వారా సాగించినట్లు తేలింది.
చేతికి మట్టి అంటకుండా వారి ద్వారానే దందా
బ్యాంక్ స్టేట్మెంట్లు సేకరిస్తున్న పోలీసులు
ఆ ఖాతాల నుంచి వైసీపీ పెద్దల అకౌంట్లకు జమ
నగదు లావాదేవీల్లో తాడేపల్లి ప్యాలె్సకూ లింకు?
అనిల్పై క్వార్ట్జ్తో పాటు మనీలాండరింగ్ కేసు కూడా!
విదేశాలకు పారిపోయిన అనిల్ ముఖ్య అనుచరుడు
నెల్లూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ క్వార్జ్ట్ అక్రమ తవ్వకం, అమ్మకాల కథంతా తన అనుచరుల ద్వారా సాగించినట్లు తేలింది. వారిని ముందుపెట్టి దందాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆయన ముఖ్య అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్రెడ్డిని పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు పంపిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్రెడ్డిది సాధారణ కుటుంబం. కానీ ఆయనతోపాటు, ఆయన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో రూ.వందల కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. ఆ డబ్బు మొత్తం క్వార్ట్జ్ వ్యాపారుల నుంచి వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. శ్రీకాంత్రెడ్డి ఖాతాల నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్లాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. కొందరు వైసీపీ పెద్దల ఖాతాలకు కొంత మొత్తం బదిలీ అయినట్లు తెలిసింది. అలాగే సైదాపురం మండలంలో అనిల్ మరో అనుచరుడి ఖాతాలో రూ.17 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ మండలంలో అనిల్ బాధితులైన క్వారీల మాజీ యజమానులు అతడి బ్యాంక్ స్టేట్మెంట్లను బుధవారం పోలీసులకు అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీకాంత్రెడ్డి, సైదాపురం వ్యక్తే కాదు.. పదుల సంఖ్యలో అనిల్ అనుచరులు అప్పట్లో క్వార్ట్జ్ అక్రమ రవాణా వ్యవహారాలను పర్యవేక్షించారని తేలింది.
అనధికార వేలం.. అనిల్ పరం
వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ అండదండలతో క్వార్డ్జ్ అక్రమ రవాణా పెద్దఎత్తున సాగింది. రెండు దశాబ్దాల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చైనాలో క్వార్ట్జ్ రేటు పెరగడం, విపరీతమైన డిమాండ్ ఏర్పడిన విషయాన్ని పసిగట్టిన వైసీపీ పెద్దలు.. నెల్లూరు జిల్లాలో విస్తారంగా ఉన్న క్వార్ట్జ్ నిక్షేపాలపై కన్నేశారు. లీజు పరిధిలో ఉన్న గనులను, ప్రభుత్వ భూముల్లో ఉన్నవాటిని అనధికారికంగా వేలం పెట్టారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో అప్పటి సీఎం జగన్ ప్రియభక్తుడైన అనిల్ వాటిని దక్కించుకున్నారని అప్పట్లోనే విస్తృతంగా ప్రచారం జరిగింది.
శ్రీకాంత్రెడ్డి విచారణలో దీనిని ధ్రువీకరించాడు. నెలకు రూ.40 కోట్లు తాడేపల్లి ప్యాలె్సకు కప్పంగా కట్టాలన్న ఒప్పందంతో మొత్తం క్వార్డ్జ్ క్వారీలన్నింటినీ అనిల్పరం చేశారు. ఎప్పటినుంచో లీజుదారులుగా కొనసాగుతున్న వారు ఎంత మొత్తుకున్నా లాభం లేకుండా పోయింది. లీజుదారులు విక్రయించే క్వార్డ్జ్పై టన్నుకు రూ.10 వేల చొప్పున అనిల్కుమార్కు కప్పం కట్టేలా హుకుం జారీ చేశారు. జిల్లా మైనింగ్ అధికారులే దగ్గరుండి ఈ వ్యవహారాలను చక్కబెట్టారు. దీనికితోడు ప్రభుత్వ భూములు, లీజు గడువు ముగిసిన క్వారీలపై పడి నేరుగా వేల టన్నుల క్వార్డ్జ్ తవ్వి తరలించి అమ్ముకున్నారు. ఒక్క సైదాపురం మండలం జోగుపల్లిలోనే 15కు పైగా అనధికారిక క్వారీల నుంచి రోజుకు 40-50 లోడ్ల క్వార్డ్జ్ను చెన్నై తరలించారు. ఈ వ్యవహారాల్లో అనిల్, కాకాణి తమ చేతికి మట్టి అంటకుండా ఎక్కడిక్కడ తమ మనుషులను ఏజెంట్లుగా పెట్టుకుని వారి ద్వారా డబ్బు వసూలు చేశారనే ప్రచారం ఉంది. శ్రీకాంత్రెడ్డి, అతడి కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్లను పరిశీలించగా.. ఏడాదిన్నర కాలంలోనే కొన్ని వందల కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వారి అకౌంట్లలోకి వచ్చాయి.. వాటి నుంచి ఏయే ఖాతాలకు వెళ్లాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అనధికారిక క్వారీల్లో తవ్వి విక్రయించిన మొత్తాన్ని హవాలా మార్గంలో విదేశీ వ్యాపారులకు తరలించి.. అక్కడి నుంచి వైట్రూపంలో వెనక్కి తెచ్చుకున్నారని.. లీజుదారుల నుంచిటన్నుకు పది వేల చొప్పున వసూలు చేసి, తమ సన్నిహితుల అకౌంట్లలో జమ చేసి.. తర్వాత సొంత ఖాతాలకు బదిలీ చేసుకున్నారని.. తాడేపల్లి ప్యాలెస్ వాటాను వైట్ రూపంలోనే అందజేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి అనిల్ను సూత్రధారిగా నిర్ధారించి.. పటిష్ఠంగా కేసు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రూ.వందల కోట్ల లావాదేవీలపై ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేయివచ్చని ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. అనిల్ అనుచరుడొకరిని పట్టుకునేం దుకు చెన్నై ఎయిర్పోర్ట్కు పోలీసులు వెళ్లేసరికే అతడు విదేశాలకు ఎగిరిపోయాడని సమాచారం.
బయట విరోధులు.. లోపల భాగస్వాములు
క్వార్ట్జ్ దోపిడీలో మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ కలిసిమెలిసి పనిచేసుకున్నారన్న సమాచారం తెలుసుకుని నెల్లూరు జిల్లా ప్రజలు విస్తుపోయారు. బయటకు వారిద్దరూ బద్ధశత్రువులు. జగన్ జమానాలో వీరిద్దరి వ్యవహారశైలి అలాగే కనిపించింది. తొలి మంత్రివర్గ విస్తరణలో అనిల్ తనకు అడ్డుపడ్డాడని కాకాణికి కోపం. అనిల్ రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేసినా ఒక్కరోజు కూడా కాకాణి నియోజకవర్గమైన సర్వేపల్లిలో అడుగుపెట్టలేకపోయారు. కాకాణి ఆయన్ను రానివ్వలేదు. రెండో విస్తరణలో కాకాణికి మంత్రి పదవి దక్కింది. అనిల్ పదవి కోల్పోయారు. దీనికి కారణం కాకాణేనని అనిల్ వర్గం ప్రచారం చేసుకుంది. ఆ రెండున్నరేళ్లు కూడా వీరిద్దరి మధ్య బయటకు సత్సంబంధాల్లేవు. అయితే అంతర్గతంగా ఆప్తులని తాజాగా తేలింది. అవినీతిలో తోడు దొంగలంటూ జనం వ్యాఖ్యానిస్తున్నారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!
Updated Date - Jul 24 , 2025 | 03:14 AM