High Court: ఆ సర్క్యులర్ మేజిస్ట్రేట్లను బెదిరించేలా ఉంది
ABN, Publish Date - Jul 10 , 2025 | 04:43 AM
సోషల్ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులలో నిందితులకు రిమాండ్ విధించే సమయంలో సుప్రీంకోర్టు..
అలాంటి సర్క్యులర్ జారీ సరికాదు
హైకోర్టుకు సీనియర్ న్యాయవాది
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులలో నిందితులకు రిమాండ్ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచిస్తూ మేజిస్ట్రేట్లకు హైకోర్టు ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది. అయితే, ఈ సర్క్యులర్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది జయం తి ఎస్సీ శేఖర్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం హైకోర్టు విధులు ప్రారంభమైన వెంటనే న్యాయవాది చాపర్ల సీతారామ్ సర్క్యులర్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని మేజిస్ట్రేట్లను బెదిరించేలా సర్క్యులర్ జారీ చేయడం సరికాదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆ సర్క్యులర్ జారీ చేశారని పేర్కొంది. న్యాయవాది సీతారామ్ బదులిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పులో మేజిస్ట్రేట్లపై శాఖపరమైన చర్యల గురించే ప్రస్తావించారు తప్ప కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని చెప్పలేదన్నారు. వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్ను లంచ్మోషన్గా విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎన్. సుబ్బారావు వాదనలు వినిపించారు. ‘‘హైకోర్టు సర్క్యులర్ సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం. ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్న కేసులలో అర్నేష్ కుమార్ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలు వర్తిస్తా యి. సోషల్ మీడియా కేసులలో ఫలానా విధంగానే వ్యవహరించాలని మేజిస్ట్రేట్లను ఆదేశించడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి’ అన్నారు.
Updated Date - Jul 10 , 2025 | 04:43 AM