AP Weather: నేడు ఉత్తరాంధ్రలో వడగాడ్పులు, వర్షాలు
ABN, Publish Date - May 09 , 2025 | 05:39 AM
ఈ రోజు ఉత్తరాంధ్రలో వడగాడ్పులు, వర్షాలు అవశ్యకమని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 42-43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు, మోస్తరు వర్షాలు, పిడుగులు వర్షాలతో పాటు మరికొన్ని మండలాల్లో క్రమంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది
అమరావతి, విశాఖపట్నం, మే 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శుక్రవారం 42-43.5 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మన్యం జిల్లా పాలకొండ, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలాల్లో తీవ్రంగా, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని మరో 21 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు ప్రభావం చూపుతాయని పేర్కొంది. అలాగే అల్లూరి జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. గురువారం సాయంత్రం వరకు కాకినాడ జిల్లా కాజులూరులో 49.5, కడప జిల్లా బెస్తవేములలో 43, చిత్తూరు జిల్లా పెదపంజానిలో 39.7, కృష్ణా జిల్లా గుడివాడలో 21, అల్లూరి జిల్లా గంపరైలో 20.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పల్నాడు జిల్లా క్రోసూరులో 41.6, ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Updated Date - May 09 , 2025 | 05:39 AM