Distant Posting: కాంట్రాక్టు లెక్చరర్లకు సర్దుబాటు శిక్ష
ABN, Publish Date - Jul 04 , 2025 | 05:45 AM
పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్లకు సాంకేతిక విద్యాశాఖ అధికారులు ‘పని సర్దుబాటు’ పేరుతో వందల కిలోమీటర్ల దూరంలోని కాలేజీలకు పంపడం విమర్శలకు దారితీసింది.
పాలిటెక్నిక్లలో వందల కిలోమీటర్ల దూర ప్రాంతాలకు విధుల మార్పు
జోన్లు మార్చి సుదూర ప్రాంతాలకు..అంత దూరం ఎలా వెళ్లాలని లెక్చరర్ల ఆందోళన
అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్లకు సాంకేతిక విద్యాశాఖ అధికారులు ‘పని సర్దుబాటు’ పేరుతో వందల కిలోమీటర్ల దూరంలోని కాలేజీలకు పంపడం విమర్శలకు దారితీసింది. ఎక్కడో జోన్-4లో పనిచేస్తున్న వారిని దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలోని జోన్-1 పాలిటెక్నిక్లకు పంపుతూ ఆదేశాలు జారీచేశారు. ఇటీవల రెగ్యులర్ లెక్చరర్ల బదిలీల అనంతరం.. పని సర్దుబాటు చేసి 57 మంది కాంట్రాక్టు లెక్చరర్లను సుదూ ర ప్రాంతాలకు పంపారు. దీనిపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేరే దారిలేక వారిలో పలువురు కొత్త స్థానాల్లో రిపోర్ట్ చేసి, వెంటనే సెలవుపై వెళ్లిపోయారు. తమకు న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సాంకేతిక విద్యాశాఖ ఇటీవల లెక్చరర్ల బదిలీ చేపట్టింది. ఆ తర్వాత జూన్ 24న ఆన్లైన్లో కాంట్రాక్టు లెక్చరర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి పని సర్దుబాటు చేసింది. కాగా, రెగ్యులర్ లెక్చరర్లనే జోన్ దాటి బదిలీ చేయ రు. కాం ట్రాక్టు లెక్చరర్లకు బదిలీలే ఉండవు. అయితే సర్దుబాటు పేరుతో ఇష్టమొచ్చినట్లు వారిని సుదూర ప్రాంతాలకు పంపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
వెళ్లకపోతే ఉద్యోగం పోతుందని బెదిరింపులు!
కర్నూలు జిల్లాలో మెకానికల్ విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా లెక్చరర్ను 885 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరంలోని గుమ్మ లక్ష్మీపురం పాలిటెక్నిక్కు సర్దుబాటు చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో పనిచేస్తున్న ఫిజిక్స్ లెక్చరర్ను దాదాపు 820 కిలోమీటర్ల దూరంలోని టెక్కలికి పంపారు. ఒంగోలులోని కెమిస్ర్టీ లెక్చరర్ను తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి, నెల్లూరులోని ఓ ఫిజిక్స్ లెక్చరర్ను సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్వతీపురం మన్యంలోని సీతంపేటకు సర్దుబాటు చేశారు. మరో ఆటోమొబైల్ లెక్చరర్ను కర్నూలు నుంచి రాజమండ్రికి పంపించారు. ఇలా జోన్-3, 4కు చెందిన 57 మందిని జోన్-2, 3లకు సర్దుబాటు చేశారు. అందులోనూ 50 మందిని జోన్-1కు పంపారు. గతంలో రెగ్యులర్ లెక్చరర్లను జోన్లు దాటి బదిలీ చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. అలాంటప్పుడు కేవలం కాంట్రాక్టుపై పనిచేస్తున్న తమను ఇన్ని వందల కిలోమీటర్లు ఎలా పంపుతారని కాంట్రాక్టు లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులను కలిసే ప్రయత్నం చేయగా.. అవకాశం ఇవ్వడం లేదని, వెళ్లకపోతే ఉద్యోగం పోతుందని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jul 04 , 2025 | 05:50 AM