PVN Madhav: గ్రామాల్లో బీజేపీ జెండా ఎగరాలి
ABN, Publish Date - Jul 30 , 2025 | 05:27 AM
రాబోవు ఎన్నికల్లో బీజేపీ జెండాను ప్రతి గ్రామంలో ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని..
దేశాన్ని సమున్నతంగా నిలపడానికిప్రధాని మోదీ అవిశ్రాంత కృషి
పంచాయతీ నిధులను దారి మళ్లించిన వైసీపీ ప్రభుత్వం
రాయలసీమ డిక్లరేషన్ను అమలు చేస్తాం: మాధవ్
కర్నూలు ఎడ్యుకేషన్, జూలై 29(ఆంధ్రజ్యోతి): రాబోవు ఎన్నికల్లో బీజేపీ జెండాను ప్రతి గ్రామంలో ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ముందుగా నగరంలోని ఓ హోటల్లో ముఖ్య కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ... ‘దేశంలో బీజేపీ శక్తి అపారమైంది. ప్రపంచంలోనే ఎవరూ సాధించలేని ప్రగతి భారతీయ జనతా పార్టీ సాధించింది. మాజీ ప్రధాని వాజ్పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అతి నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రధానమంత్రులు అయ్యారు. కుటుంబ నేపథ్యం, డబ్బు, అధికారం... ఏదీ లేకుండానే ఉన్నత స్థాయికి ఎదగడం బీజేపీలోనే సాధ్యమవుతుంది. వివిధ దేశాల్లోని భారతీయ మూలాలు ఉన్న వారు సగర్వంగా తల ఎత్తుకునేలా ప్రధాని నరేంద్ర మోదీ చేశారు. 2014 సంవత్సరం కంటే ముందు ఆర్థికంగా భారత్ 11వ స్థానంలో ఉంది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ అయ్యాక నాల్గవ స్థానానికి చేరింది. త్వరలో 3వ స్థానంలో నిలబెట్టేందుకు ప్రధాని విశేషంగా కృషి చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియాతో వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశం చేరింది. మన దేశంపై ఉగ్రదాడి చేసిన పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టించడం మేదీకి మాత్రమే సాధ్యమయింది. రాష్ట్రంలో గత ప్రభుత్వం పంచాయతీ నిధులను దారి మళ్లించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక నేరుగా పంచాయతీలకు నిధులు సమకూర్చింది. రాయలసీమ డిక్లరేషన్ను అమలు చేస్తాం. నీటి ప్రాజెక్టుల పూర్తికి, పరిశ్రమల స్థాపనకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పక్క రాష్ట్రంతో ఉన్న చిక్కు ముడులను పరిష్కరించి, మనకు రావాల్సిన నీటి వాటాను సాధించేందుకు బీజేపీ కృషి చేస్తుంది. కూటమి అధిష్ఠానంతో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు, నామినేటెడ్ పదవుల్లో బీజేపీకి రావాల్సిన వాటాను సాధిస్తాం’ అని మాధవ్ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్, జిల్లా అధ్యక్షుడు అక్కంతోట రామకృష్ణ, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Read latest AndhraPradesh News And Telugu News
Updated Date - Jul 30 , 2025 | 05:27 AM