AP NIT: ఏపీ నిట్కు మళ్లీ ఇన్చార్జే దిక్కు
ABN, Publish Date - May 15 , 2025 | 03:42 AM
ఏపీ నిట్కు రెగ్యులర్ డైరెక్టర్ లేకపోవడంతో పాలనాపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో అన్యాయం జరుగుతున్నట్లుగా, ఎలాంటి అభివృద్ధి చర్యలు లేకపోవడంతో ఈ సంస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
ఇన్చార్జి డైరెక్టర్గా రమణారావుకు మరో 6 నెలల పొడిగింపు
రెగ్యులర్ డైరెక్టర్ లేక పాలనాపరమైన సమస్యలతో కుదేలు
తాడేపల్లిగూడెం అర్బన్, మే 13(ఆంధ్రజ్యోతి): ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ రమణారావును కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. దీంతో రెగ్యులర్ డైరెక్టర్ నియామకం మళ్లీ వాయిదా పడినట్టేనని తేటతెల్లమైంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్న ఏపీ నిట్కు రెగ్యులర్ డైరెక్టర్ లేకపోవడంతో పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఇన్చార్జి డైరెక్టర్ మూడు నెలలకోసారి కూడా ఏపీ నిట్ను సందర్శించడం లేదు. మరో వైపు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కూడా ఏర్పాటు కాలేదు. చైర్మన్నూ నియమించలేదు. ఇవన్నీ ఏపీ నిట్ అభివృద్ధికి అవరోధంగా మారుతున్నాయి. ఇప్పటికే విద్యార్థుల సంఖ్య 750 నుంచి 480కి పడిపోయింది. వచ్చే ఏడాది కూడా 480 సీట్లకే అడ్మినిషన్ కల్పించనున్నారు. దీని వల్ల రాష్ట్రంలోని విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. మొత్తం సీట్లలో 50 శాతం రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. సీట్ల కుదింపు వల్ల 270 మంది విద్యార్థులకు ఏపీ నిట్లో అవకాశం లేకుండా పోతోంది. అందులో 135 మంది రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఫ్యాకల్టీ నియామకం, కొత్త హాస్టల్ నిర్మాణం చేపడితేనే 750 సీట్లకు పెంచనున్నట్టు నిట్ అధికారులు చెబుతున్నారు. హాస్టల్స్ ఇతర భవన నిర్మాణాల కోసం రూ.450 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికీ అవి మంజూరు కాలేదు. కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు చేయాలంటే రెగ్యులర్ డైరెక్టర్ ఉండాలి. గతంలో డైరెక్టర్ను మధ్యలో తొలగించడంతో కొత్తవారు రావడానికి ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ డైరెక్టర్ లేక ప్లేస్మెంట్స్ కూడా తగ్గిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. గత రెండేళ్లలో ప్లేస్మెంట్స్ తగ్గుముఖం పట్టాయి. ప్రముఖ బహుళ జాతి సంస్థలు కూడా రావడం లేదు. నిట్ డైరెక్టర్ ఉంటేనే ప్లేస్మెంట్ ఇచ్చే సంస్థలు కూడా వస్తాయి. ఒక దశలో అభివృద్ధి పరంగా దూసుకుపోయిన ఏపీ నిట్ సంస్థ.. డైరెక్టర్ లేకపోవడంతో చతికిలపడుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 15 , 2025 | 03:42 AM