Hyderabad: రైతు భరోసాపై ప్రజాభిప్రాయం!
ABN, Publish Date - Jun 29 , 2024 | 03:17 AM
రైతుభరోసా పథకాన్ని ఎలా అమలుచేయాలనే అంశంపై క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కొన్నిచోట్ల రైతులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించగా...
నేటి నుంచి 4వ తేదీ వరకు చర్చలు.. రైతులు, నేతలతో భేటీలు
హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): రైతుభరోసా పథకాన్ని ఎలా అమలుచేయాలనే అంశంపై క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కొన్నిచోట్ల రైతులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించగా... క్షేత్రస్థాయిలో రైతులు, రైతుసంఘాల నేతలు, ఇతరవర్గాల అభిప్రాయాన్ని కూడా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు శనివారం నుంచి జూలై నాలుగో తేదీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. సాగుకు యోగ్యంలేని భూములను తొలగించడంతోపాటు ఎకరాల వారీగా కటాఫ్ పెట్టాలన్న అభిప్రాయాలు గతంలోనే వ్యక్తమయ్యాయి. ఈ అంశాలపై అభిప్రాయ సేకరణ సదస్సుల్లో చర్చించనున్నారు.
సాగు చేయని భూములపై ఐదు జిల్లాల్లో సర్వే
సాగు చేయకుండా ఖాళీగా ఉంటున్న భూముల లెక్క పక్కాగా తేలుస్తున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో సర్వే చేస్తున్నారు. రాష్ట్రంలో ఐదు జిల్లాలను సర్వేకు నమూనాగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఖమ్మం, సంగారెడ్డి, కామారెడ్డి, కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో నాలుగు రోజులుగా సర్వే ప్రక్రియ సాగుతోంది. ఏటా వ్యవసాయాధికారులు వానాకాలం, యాసంగి సాగు వివరాలను నివేదిక ద్వారా సిద్ధం చేస్తుండగా.. కొన్ని సర్వే నంబర్లలో ఏ పంట వేయడం లేదని ఖాళీగా చూపుతున్నారు. ఖమ్మం జిల్లాలో 53 వేల సర్వే నంబర్లు, సంగారెడ్డి జిల్లాలో 97,293, కామారెడ్డిలో 35,672, హన్మకొండలో 29 వేలు, కరీంనగర్ జిల్లాలో 50,785 సర్వే నంబర్లలో ఏ పంటలు వేయకుండా ఖాళీగా ఉన్నట్లు అంచనాలున్నాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ ఏవోలు, ఏఈవోలు, గ్రామ కార్యదర్శులు తదితర సిబ్బంది సహకారంతో క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు.
Updated Date - Jun 29 , 2024 | 03:18 AM