Yadagirigutta: యాదగిరి ప్రదక్షిణం
ABN, Publish Date - Jun 09 , 2025 | 04:28 AM
యాదగిరి గుట్ట లక్ష్మీనృసింహస్వామి ‘స్వాతి’ జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు ఆదివారం గిరి ప్రదక్షిణ చేశారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతోపాటు వారాంతపు సెలవు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన సుమారు 25వేల మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
నృసింహ నామస్మరణతో హోరెత్తిన పుణ్యక్షేత్రం
యాదగిరిగుట్ట, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): యాదగిరి గుట్ట లక్ష్మీనృసింహస్వామి ‘స్వాతి’ జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు ఆదివారం గిరి ప్రదక్షిణ చేశారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతోపాటు వారాంతపు సెలవు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన సుమారు 25వేల మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 5.30 గంటలకు అర్చకుల వేద మంత్రాల పఠనం, ఆస్థాన విద్వాసుల మంగళవాయిద్యాల నడుమ ఆలయ వైకుంఠ ద్వారం వద్ద ఆలయ ఈఓ ఎస్.వెంకట్రావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దంపతులు ప్రత్యేక పూజలు చేసి హారతి సమర్పించి, గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ప్రత్యేక వేషధారణలో కళాకారుల నృత్యాలు, భక్తుల భజనలు, కీర్తనలో ప్రదక్షిణ మార్గం హోరెత్తింది. 2.5 కి.మీ దూరం గల కొండ చుట్టూ సుమారు 45 నిమిషాల పాటు గిరి ప్రదక్షిణ సాగింది. కాగా, ఆదివారం ఒక్క రోజే వివిధ విభాగాల ద్వారా స్వామి వారికి రూ.85,57,558 ఆదాయం సమకూరింది. కాగా, ఆలయ ముఖ మండపంలో పవిత్ర జలాలు, పంచామృతాలు నింపిన 108 కలశాలపై నూతన వస్త్రాలు కప్పి, కొబ్బరి కాయలు పేర్చిన అర్చకులు పంచసూక్త పఠనాలతో హోమం చేశారు. ఉత్సవ మూర్తులను, అలంకార మూర్తులను అభిషేకించి తులసీ దళాలతో సహస్ర నామార్చన చేశారు. అటుపై వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ వైభవంగా 108 సువర్ణ పుష్పాలతో అర్చన, అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. సాయంత్రం నృసింహస్వామిని దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలుచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News
Updated Date - Jun 09 , 2025 | 04:28 AM