Akshith Reddy: ఈసా కాలువలో బీటెక్ విద్యార్థి గల్లంతు
ABN, Publish Date - Jul 28 , 2025 | 04:04 AM
ఈసా కాలువపై ఉన్న మొండి కత్వపై నడుస్తూ ఫొటోలు దిగుతుండగా జారి పడి అక్షిత్ రెడ్డి (20) అనే బీటెక్ విద్యార్థి గల్లంతయ్యాడు.
మొండి కత్వపై నడుస్తూ ఫొటోలు దిగుతుండగా కాలు జారి ప్రమాదం
రాజేంద్రనగర్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఈసా కాలువపై ఉన్న మొండి కత్వపై నడుస్తూ ఫొటోలు దిగుతుండగా జారి పడి అక్షిత్ రెడ్డి (20) అనే బీటెక్ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ప్రదేశం హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ మూసీ నది వరకు ప్రవహించే ఈసా కాలువ మార్గంలో జన చైతన్య వెంచర్ వద్ద ఉంది. ఈసా కాలువపై మొండి కత్వ గోడ పైనుంచి నీరు పారుతూ కనిపిస్తుంది. ఇది సామాజిక మాధ్యమాల్లో రీల్స్లో అందమైన జనచైతన్య వాటర్ ఫాల్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. వర్షాలు పడుతుండడంతో గోడపై గడ్డి మొలిచి పాకురు పట్టి ప్రమాదకరంగా మారింది.
జీడిమెట్ల జగద్గిరిగుట్టకు చెందిన వీజేఐటీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న అక్షిత్ రెడ్డి ముగ్గురు స్నేహితులతో కలిసి మొండి కత్వ వద్దకు ఆదివారం వచ్చారు. మొండి కత్వ గోడపై నడుస్తూ ఫొటోలు దిగుతుండగా అక్షిత్ రెడ్డి కాలు జారి కాలువలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. రాజేంద్రనగర్ పోలీసులు, డీఆర్ఆఫ్ సిబ్బంది సాయంత్రం వరకు గాలించినా ఫలితం కనిపించలేదు. మొండి కత్వ వద్దకు ఎవరూ వెళ్లొద్దని, ఆ ప్రదేశం చాలా ప్రమాదకరమని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన అక్షిత్రెడ్డి తిరిగి సోమవారం హాస్టల్కు వెళ్లాల్సివుందని, ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయిం దని అక్షిత్ రెడ్డి తండ్రి రవీందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రవీందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - Jul 28 , 2025 | 04:04 AM