అర్చక, ఉద్యోగులకు పెన్షన్
ABN, Publish Date - May 29 , 2025 | 04:23 AM
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అర్చక, ఉద్యోగులకు ఇతర కార్పొరేషన్ ఉద్యోగుల తరహాలో పదవీ విరమణ అనంతరం పెన్షన్ అందించేందుకు అర్చక సంక్షేమ బోర్డు ఆమోదం తెలిపింది.
5 లక్షల ఆరోగ్య బీమా.. అర్చక సంక్షేమ బోర్డు ఆమోదం
హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అర్చక, ఉద్యోగులకు ఇతర కార్పొరేషన్ ఉద్యోగుల తరహాలో పదవీ విరమణ అనంతరం పెన్షన్ అందించేందుకు అర్చక సంక్షేమ బోర్డు ఆమోదం తెలిపింది. బుధవారం సచివాలయంలో అర్చక సంక్షేమ బోర్డు చైర్మన్ నవీన్ మిత్తల్ నేతృత్వంలో బోర్డు సమావేశం జరిగింది. ఇప్పటి వరకు అర్చక, ఉద్యోగులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రి ఖర్చులకు రూ.2 లక్షల వరకు బోర్టు నుంచి రీయింబర్స్మెంట్ చేస్తున్నారు.
ఇకపై అలా కాకుండా రూ.5లక్షల ఆరోగ్య బీమా కల్పించనున్నారు. బీమా ప్రీమియం మొత్తాన్ని బోర్డు నుంచి చెల్లిస్తారు. పదవీ విరమణ చేసిన అర్చక, ఉద్యోగులకు పెన్షన్ చెల్లింపునకు బోర్డు ఆమోదం తెలిపింది. సీనియార్టీని బట్టి రూ.10-20వేల వరకు ప్రతి నెల పెన్షన్ అందించనున్నారు. గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.8 లక్షలకు పెంచుతూ బోర్డు తీర్మానించి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం పట్ల అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ బోర్డు చైర్మన్, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - May 30 , 2025 | 03:01 PM