T. Jagga Reddy: ఎస్ఎల్బీసీని వైఎ్సఆర్ మొదలెడితే రేవంత్, ఉత్తమ్లు పూర్తి చేస్తున్నారు
ABN, Publish Date - Mar 03 , 2025 | 04:33 AM
‘‘ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగితే.. సీఎం రేవంత్రెడ్డి ఎందుకు పోలేదంటూ హరీశ్రావు మాట్లాడుతున్నడు. కొండగట్టు ప్రమాదంలో 65 మంది, మాసాయిపేట రైలు ప్రమాదంలో 25 మంది చిన్నారులు చనిపోతే.. కనీసం చూసేందుకైనా కేసీఆర్ వెళ్లలేదు.
టన్నెల్లో ఇరుక్కుపోయిన 8 మందిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి
కొండగట్టులో 65 మంది, మాసాయి పేటలో 25 మంది చనిపోతే కేసీఆర్పై లేవని గొంతు ఇప్పుడెందుకు లేస్తోంది?
హరీశ్రావుపై తూర్పు జగ్గారెడ్డి ఫైర్
బీజేపీ నేతలకు శిక్షణా.. క్రమ శిక్షణా లేదు
వారా మాట్లాడేదంటూ ధ్వజం
హైదరాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగితే.. సీఎం రేవంత్రెడ్డి ఎందుకు పోలేదంటూ హరీశ్రావు మాట్లాడుతున్నడు. కొండగట్టు ప్రమాదంలో 65 మంది, మాసాయిపేట రైలు ప్రమాదంలో 25 మంది చిన్నారులు చనిపోతే.. కనీసం చూసేందుకైనా కేసీఆర్ వెళ్లలేదు. అప్పుడు కేసీఆర్పై లేవని గొంతు.. ఇప్పుడు రేవంత్రెడ్డిపై ఎందుకు లేస్తోంది?’’ అంటూ హరీశ్రావును టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి నిలదీశారు. మంత్రులు జూపల్లి, ఉత్తమ్లు ప్రమాదం జరిగిన టన్నెల్ వద్దే ఉండి ప్రతి రోజూ సమీక్షిస్తున్నది హరీశ్రావుకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వారిలాగా తమది అశ్రద్ధ ప్రభుత్వం కాదని, జవాబుదారీ పాలనన్నారు. టన్నెల్లో దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగితే.. ప్రతిదాన్నీ తప్పు పట్టాలని, బురద చల్లాలని తపన పడుతున్న హరీశ్రావు.. అధికారంలో ఉన్న పదేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎందుకు తపన పడలేదని నిలదీశారు. గాంధీభవన్లో ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ ఆదేశాలతో మంత్రి ఉత్తమ్ 8 రోజులుగా ప్రమాదం జరిగిన టన్నెల్ వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారని చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నాడు వైఎ్సఆర్ ప్రారంభిస్తే.. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్లు పూర్తి చేస్తున్నారన్నారు. పదేళ్లలో కేసీఆర్ కొంత పని చేసినా.. పూర్తి చేయలేక పోయారన్నారు. రేవంత్రెడ్డి సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కిందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయించాలని ఉత్తమ్, కోమటిరెడ్డి సోదరులు, జానారెడ్డి తదితర ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. కార్మికు లు చిక్కుకుపోవడంతో పనులకు బ్రేక్ పడిందన్నారు.
కేబుల్ బ్రిడ్జి కూలితే మోదీ ఎందుకు పోలేదు?
గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలి 134 మంది చనిపోతే ప్రధాని మోదీ అక్కడికి ఎందుకు పోలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తమని అడిగే ముందు.. కేబుల్ బ్రిడ్జి కూలితే ఎందుకు పోలేదంటూ మోదీని ప్రశ్నించాలని ఎంపీ రఘునందన్రావుకు హితవు పలికారు. బీజేపీలో శిక్షణా.. క్రమశిక్షణా లేదని, ఇక వారు కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడతారని ఎద్దేవాచేశారు.
Updated Date - Mar 03 , 2025 | 04:33 AM