COVID: కొవిడ్పై సర్కారు సన్నద్ధత
ABN, Publish Date - Jun 08 , 2025 | 04:35 AM
రాష్ట్రంలో COVID కేసులు పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మీడియా సమీక్షలో టెస్టింగ్ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, ఔషధాలు అందుబాటులో ఉండేలా టీజీఎంఎ్సఐడీసీకి ఇండెంట్ ఆదేశించారు.
10 లక్షల టెస్టింగ్ కిట్ల కొనుగోలుకు టెండర్లు
మాస్కులు, శానిటైజర్ల కోసం కూడా
ఇప్పటికే 5 వేల ఆర్టీపీసీఆర్ కిట్లకు పీవోలు
7.5 కోట్ల పారాసిటమాల్ మాత్రలు సిద్దం
రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు
దేశవ్యాప్తంగా 5,755 కేసుల నమోదు
హైదరాబాద్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమ్తమైంది. కరోనా వ్యాప్తిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో టెస్టింగ్ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, ఔషధాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన ఓ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడి విభాగం తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ(టీజీఎంఎ్సఐడీసీ)కి ఇండెంట్ పెట్టింది. దీంతో.. టీజీఎంఎ్సఐడీసీ రంగంలోకి దిగింది. బోధనాస్పత్రుల్లో కొవిడ్ చికిత్సకు అవసరమైన ఔషధాల అవసరం ఏ మేర ఉందనే అంశంపైనా దృష్టిసారించింది.
10 లక్షల ర్యాపిడ్ కిట్లు
కొవిడ్ నిర్ధారణకు ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీ-జెన్ కిట్లను వినియోగిస్తారు. ఐదు వేల ఆర్టీపీసీఆర్, 10 లక్షల ర్యాపిడ్ కిట్ల కోసం టెండర్లకు టీజీఎంఎ్సఐడీసీ ఆహ్వానించింది. ఈ నెల 9తో టెండర్ల ప్రక్రియ ముగుస్తుందని అధికారులు తెలిపారు. దీంతోపాటు.. ఎన్-95 మాస్కులు 7.35 లక్షల మేర అందుబాటులో ఉండగా.. 10.32 లక్షల సాధారణ(సర్జికల్) మాస్కులు, శానిటైజర్ల కోసం టెండర్లను ఆహ్వానించారు. 7.5 కోట్ల పారాసిటమాల్ మాత్రలు, 35.6 లక్షల అజిత్రోమైసిన్, 1.43 కోట్ల అమోక్సిలిన్(యాంటీబయాటిక్స్), 6.5 కోట్ల విటమిన్ బీ/జింక్, 1.06 కోట్ల విటమిన్ సీ, 37.3 లక్షల లివోసిట్రాజిన్ ట్యాబ్లెట్లు, 16.27 లక్షల యాంబ్రోక్సెల్ సిరప్ సీసాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
అందుబాటులో ఔషధాలు
కొవిడ్ చికిత్సకు అవసరమయ్యే అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. టెండర్లు ఆహ్వానించిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు, శానిటైజర్లు, సర్జికల్ మాస్కులు త్వరలో అందుబాటులోకి వస్తాయి.
- జి.ఫణీంద్రారెడ్డి, టీజీఎంఎ్సఐడీసీ ఎండీ
రాష్ట్రంలో 10 కేసులు
తెలంగాణలో ఇప్పటి వరకు 10 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. నిజామాబాద్లోనూ తొలి కొవిడ్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కొవిడ్ పాజిటివ్గా తేలినట్లు అధికారులు తెలిపారు. మన దగ్గర పూర్తిస్థాయిలో కొవిడ్ టెస్టులు జరగడం లేదని.. కిట్లు అందుబాటులోకి వస్తే పరీక్షలు పెరుగుతాయని పీహెచ్సీల్లో పనిచేసే వైద్యులు చెబుతున్నారు. కాగా.. దేశంలో 5,755 యాక్టివ్ కేసులున్నాయి.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..
Updated Date - Jun 08 , 2025 | 04:36 AM