తుది శ్వాస దాకా నమ్మిన బాటలోనే!
ABN, Publish Date - Jun 19 , 2025 | 04:08 AM
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఆయన స్వగ్రామం వెలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మావోయిస్టు నేత రవి మృతితో వెలిశాలలో విషాదం.. అన్న సారయ్య స్ఫూర్తితో 1992లో ఉద్యమంలోకి..
2004లో పీపుల్స్వార్ ప్రతినిధిగా చర్చలకు హాజరు
33 ఏళ్లు అజ్ఞాతంలోనే.. గణేశ్పై రూ.40లక్షల రివార్డు
టేకుమట్ల, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఆయన స్వగ్రామం వెలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. గణేశ్ మరణవార్త తెలిసిన కుటుంబ సభ్యులు హనుమకొండ నుంచి ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. కాగా, గురువారం గణేశ్ మృతదేహాన్ని వెలిశాలకు తీసుకువచ్చే అవకాశాలున్నట్లు గ్రామస్తులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలకు చెందిన గాజర్ల కనకమ్మ-మల్లయ్య దంపతులకు ఐదుగురు సంతానం. అన్నదమ్ములైన గాజర్ల రామయ్య, గాజర్ల సమ్మయ్య, గాజర్ల సారయ్య, గాజర్ల రవి, గాజర్ల అశోక్.. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహాయపడుతూ చదువుకునే వారు. నిర్బంధాల నుంచి విముక్తి పొందాలంటే రాజకీయాల వైపు వెళ్లాలని భావించిన గాజర్ల సారయ్య 1987లో సింగిల్ విండో చైర్మన్గా పోటీ చేసి.. ఓడిపోయారు.
ఆ ఎన్నికల్లో ప్రత్యర్థి నల్లా కృష్ణారెడ్డి రిగ్గింగ్ చేసి గెలుపొందారన్న కోపంతో 1989లో సారయ్య పీపుల్స్వార్ గ్రూపులో చేరారు. సారయ్య బాటలోనే 1992లో గాజర్ల రవి అలియాస్ గణేశ్, 1994లో గాజర్ల అశోక్ అలియాస్ ఐతు ఉద్యమంలో చేరారు. వీరిలో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ 2008లో ఏటూరునాగారం మండలంలోని కంతనపల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. గాజర్ల అశోక్ 2015లో అనారోగ్య కారణాలతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. తన 23వ ఏట ఉద్యమంలోకి వెళ్లిన గణేశ్ 33 ఏళ్లుగా అజ్ఞాతంలోనే కొనసాగారు. ఆయనపై రూ.40లక్షల రివార్డు ఉంది. ఏటూరునాగారం దళ సభ్యుడిగా, కమాండర్గా, నార్త్ తెలంగాణ ఫారెస్టు డివిజన్ కమి టీ సభ్యుడిగా, 2007లో ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా పని చేశారు. 2010 నుంచి కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. 2002లో మహదేవపూర్ ఏరియా కమాండర్గా పనిచేస్తున్న స్వరూప అలియాస్ జిలానీబేగంను పెళ్లి చేసుకున్నారు. ఏవోబీలోని రామగూడలో జరిగిన ఎన్కౌంటర్లో స్వరూప మరణించారు. 2004లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో పీపుల్స్వార్ తరపున పాల్గొన్న ప్రతినిధుల్లో గణేశ్ ఒకరు. ఆ చర్చలు విఫలం కావడంతో తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. నమ్మిన సిద్ధాంతం బాటలోనే చివరి వరకూ నడిచారు.
Updated Date - Jun 19 , 2025 | 04:08 AM