KTR: వ్యవసాయానికే నా తొలి ప్రాధాన్యం
ABN, Publish Date - Jun 22 , 2025 | 05:05 AM
తెలంగాణలో తాను వ్యవసాయ రంగానికే మొదటి ప్రాధాన్యమిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.
పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల సృష్టి
బడుగుల సంక్షేమ కార్యక్రమాలు చేపడతా
సీఎం అయితే ప్రాధాన్యాలేమిటన్న ప్రశ్నలకు కేటీఆర్ స్పందన
యూకేలో ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సుకు హాజరు
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో తాను వ్యవసాయ రంగానికే మొదటి ప్రాధాన్యమిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల సృష్టి, రాష్ట్రంలో మరింత ఆర్థిక వృద్ధిని సాధించడం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం వంటి కార్యక్రమాలు చేపడతానని అన్నారు. శనివారం ‘గవర్నింగ్ ఇన్నోవేషన్ - ఏ తెలంగాణ కేస్ స్టడీ ’ అనే అంశంపై యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ సభికులతో ముచ్చటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయితే.. మీ ప్రాధాన్యాలేమిటన్న ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. మానవీయ కోణంలో అభివృద్ధి, విద్య, వైద్య, సంక్షేమ రంగాల్లో సమ్మిళిత అభివృద్ధిని సాధించాలన్నదే తన ఉద్దేశమని తెలిపారు. రాజకీయాల్లో మహిళల పాత్ర గురించి అడగగా.. మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నామని, మహిళలకు రాజకీయాల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తే గేమ్ చేంజర్గా మారుతుందని తెలిపారు.
మహిళల నాయకత్వంలో క్రమ శిక్షణ ఉంటుందని, వారి క్రియాశీల పాత్ర పెరుగుదలతో దేశం ప్రగతి బాట పడుతుందన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై స్పందిస్తూ.. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను విభజిస్తే తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలను శిక్షించించినట్లవుతుందని పేర్కొన్నారు. జనాభా నియంత్రను పాటించిన తెలంగాణకు ఈ విధానం సరైనది కాదన్నారు. దానికి బదులుగా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎ్సడీపీ)ల ఆధారంగా నియోజకవర్గాల విభజన చేపట్టాలని, అలాగైతే.. ప్రగతిశీల రాష్ట్రాలకు పార్లమెంటులో మరింత ప్రాతినిధ్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల విషయంలో పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.4 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ఇప్పుడు రూ.15 లక్షల కోట్లకు చేరిందని, తలసరి ఆదాయం రూ.1,12,000 నుంచి రూ.3,57,000కు పెరిగిందని వివరించారు.
మహిళలపై దాడి రాక్షసత్వానికి నిదర్శనం
భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామంలో గిరిజన మహిళలపై అటవీ అధికారులు అమానుషంగా వ్యవహరించారని, కాంగ్రెస్ రాక్షసత్వానికి ఈ ఘటనే నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఆ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన మహిళల చీరలను చింపడం, వారిని నిర్దాక్షిణ్యంగా కొట్టడం క్రూరత్వమని మండిపడ్డారు.
Updated Date - Jun 22 , 2025 | 05:05 AM