Formula E Case: ఫార్ములా ఈ కేసు.. ఏసీబీ ముందుకు ఆ కంపెనీ ప్రతినిధులు
ABN, Publish Date - Jan 18 , 2025 | 04:46 PM
Telangana: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు ఎస్ నెక్ట్స్ కంపెనీ ప్రతినిధులు ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. సీజన్ 9, తర్వాత రేస్ల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడంపై ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 18: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో (Formula E Car Race Case) ఏసీబీ (ACB) విచారణకు ఎస్ నెక్స్ట్ జెన్ కంపనీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిను ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే. 2022 అక్టోబర్ 25న జరిగిన తొలి ఒప్పందంపై కంపెనీ ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నిస్తోంది. సీజన్ 9, తర్వాత రేస్ల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడంపై ఆరా తీస్తున్నారు. సీజన్ 9 మిగతా రెండు విడతల డబ్బులు ఎందుకు చెల్లించలేదో అని అడిగి తెలుసుకుంటున్నారు.
చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు.. వాళ్లకు నో చాన్స్
సీజన్ 9 కోసం కేవలం ఒక దఫా రూ.30 కోట్లు మాత్రమే గ్రీన్కో చెల్లించింది. మిగతా రెండు విడతల డబ్బులు ఎఫ్ఈవోకు గ్రీన్కో ఎగ్గొట్టింది. సీజన్ 10 తో పాటు నాలుగు సీజన్లకు ఒప్పందం చేసుకున్నప్పటికీ ఎందుకు వెనక్కి వెళ్లిందో అని నెక్స్ట్ జెన్ కంపనీ ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నించనుంది. అగ్రిమెంట్ ఉల్లంఘనకు ప్రధాన కారణం ఏంటో అని గ్రీన్కోను క్వశ్చన్ చేయనుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన ఎలక్టొరల్ బాండ్స్ తేదీలపైనా ఏసీబీ దృష్టిసారించింది.
కాగా.. ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఈరోజు ఉదయం 10 గంటలకు ఏసీబీ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఇతర రాష్ట్రం నుంచి వస్తున్న క్రమంలో ఫ్లైట్ డిలే కావడంతో ఏసీబీ అధికారుల అనుమతి తీసుకుని మధ్యాహ్నానికి సదరు కంపెనీ ప్రతినిధులు విచారణకు వచ్చారు. సీజన్ 9 నిర్వహణకు సంబంధించిన ఒప్పంద పత్రాలు, సీజన్ 10 నుంచి ఎందుకు వైదొలిగారు అనే అంశాలపై కంపెనీ ప్రతినిధులను వివరాలు అడిగి.. వారు ఇచ్చే స్టేట్మెంట్ను రికార్డు చేయనుంది ఏసీబీ. రూ.55 కోట్లు ఎఫ్ఈవో కంపెనీకి బదిలీ అయిన తర్వాత.. సీజన్ 10ను నిర్వహించేందుకు ఎఫ్ఈవో కంపెనీ కూడా నిరాకరించడంతో.. ముందస్తు ఒప్పందాలను కూడా ఉల్లంఘించారని ప్రభుత్వం భావిస్తోంది. 2022 అక్టోబర్ 25న జరిగిన తొలి ఒప్పందానికి సంబంధించి డాక్యుమెంట్లతో ఎస్ నెక్స్ట్ జెన్ కంపనీ ప్రతినిధులు హాజరయ్యారు.
ఒప్పందాల వివరాలు, స్పాన్సర్షిప్, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టం వాటిల్లిదనే దానిపై ఏసీబీ విచారిస్తోంది. అవసరం అనుకుంటే మరోసారి కూడా విచారణకు రావాల్సి ఉంటుంది. మధ్యాహ్నం నుంచి విచారణ ప్రారంభమైన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5, 6 గంటలకు విచారణ ముగియనుంది. సమయం తక్కువగా ఉన్న తరుణంలో మరోసారి విచారణకు రావాల్సిందిగా కంపెనీ ప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్లను ఏసీబీ విచారణ జరిపి స్టేట్మెంట్ను రికార్డు చేసిన నేపథ్యంలో వారి స్టేట్మెంట్ ఆధారంగా కంపెనీ ప్రతినిధులను ఏసీబీ విచారిస్తోంది. అలాగే కేసులో అనుబంధ కంపెనీలు ఉన్నందున వాటికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని ఏసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు
Forest department: పెండింగ్ ప్రాజెక్ట్లపై కేంద్ర అటవీశాఖ సమీక్ష
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 18 , 2025 | 04:47 PM