Fertility Centers: సంతాన సాఫల్య కేంద్రాలపై నజర్
ABN, Publish Date - Aug 02 , 2025 | 05:26 AM
కృత్రిమ గర్భధారణ చికిత్స(ఐవీఎఫ్), సరోగసీ పేరిట శిశువుల అక్రమ రవాణాకు పాల్పడిన ‘సృష్టి’ ఫర్టిలిటీ ఘటనతో సంతాన సాఫల్య కేంద్రాలపై ప్రభుత్వం దృష్టిసారించింది.
తనిఖీల కోసం రంగంలోకి 35 బృందాలు.. నేటి నుంచి 3 రోజులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిశీలన
దశలవారీగా మిగతా జిల్లాల్లో
పోలీసుల విచారణకు సహకరించని డాక్టర్ నమ్రత
తనను ఇరికించారని ఆరోపణ
హైదరాబాద్/హైదరాబాద్సిటీ/అడ్డగుట్ట, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ గర్భధారణ చికిత్స(ఐవీఎఫ్), సరోగసీ పేరిట శిశువుల అక్రమ రవాణాకు పాల్పడిన ‘సృష్టి’ ఫర్టిలిటీ ఘటనతో సంతాన సాఫల్య కేంద్రాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. శనివారం నుంచి ఫర్టిలిటీ కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేయనుంది. ఇందుకోసం వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆధ్వర్యంలో 35 తనిఖీ బృందాలను రంగంలోకి దింపింది. తొలుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు రోజుల పాటు తనిఖీలు చేపడతారు. తర్వాత దశలవారీగా జిల్లాల్లో నిర్వహిస్తారు. శుక్రవారం కమిషనర్ కార్యాలయంలో ఈ బృందాల్లో ఉండే సభ్యుల పేర్లను ఖరారు చేశారు. తనిఖీలకు సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషనర్ సంగీతా సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 307 సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 157 వరకు ఉన్నాయి. సంతాన సాఫల్య కేంద్రాల్లో తనిఖీల కోసం 29 అంశాలతో కూడిన చెక్లిస్టును కమిషనర్ కార్యాలయం సిద్ధం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ తర్వాత ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఫర్టిలిటీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిలో తనిఖీల కోసం రాష్ట్రస్థాయి నుంచి అధికారులను పంపే అవకాశం ఉందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.
విచారణకు సహకరించని నమ్రత
సంతాన సాఫల్య చికిత్స కోసం వచ్చిన దంపతులను మోసం, శిశువుల విక్రయం కేసులో అరెస్టయిన ‘సృష్టి’ సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు శుక్రవారం విచారించారు. కోర్టు ఐదు రోజుల కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి, నార్త్జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు. సాయంత్రం 6గంటల దాకా విచారించి, బేగంపేట మహిళా పోలీ్సస్టేషన్కు తరలించారు. అయితే విచారణలో అధికారుల ప్రశ్నలకు నమ్రత సమాధానం ఇవ్వకుండా దాటవేసినట్టు తెలిసింది. తానెలాంటి తప్పూ చేయలేదని చెబుతూ వచ్చినట్టు సమాచారం. మరోవైపు సృష్టి ఫర్టిలిటీ కేంద్రంలో చికిత్స చేయించుకున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. బాధితులపై నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపైనా ఆరా తీస్తున్నారు. కాగా, వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో నమ్రత మాట్లాడుతూ.. రాజస్థాన్ దంపతులు, పోలీసులు తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. తాను బయటికి వచ్చాక అన్ని విషయాలు చెబుతానన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్రెడ్డికి సమర్పణ
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత
Read latest Telangana News And Telugu News
Updated Date - Aug 02 , 2025 | 05:26 AM