Gouda Community: కల్లు సొసైటీలపై నిషేధానికి కుట్ర
ABN, Publish Date - Jul 15 , 2025 | 05:24 AM
కల్తీ కల్లు పేరుతో కలు సొసైటీలను నిషేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం, లిక్కర్ మాఫియాలు కుట్రలు చేస్తున్నాయని గౌడ సంఘాల నేతలు ఆరోపించారు.
కల్తీ కల్లు ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
గౌడ సంఘాల నేతల డిమాండ్
బర్కత్పుర, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కల్తీ కల్లు పేరుతో కలు సొసైటీలను నిషేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం, లిక్కర్ మాఫియాలు కుట్రలు చేస్తున్నాయని గౌడ సంఘాల నేతలు ఆరోపించారు. కూకట్పల్లిలో జరిగిన కల్తీ కల్లు ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సోమవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గౌడ కల్లు గీతల సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్రాజ్ గౌడ్, గౌడ కల్లు గీత వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఆయిలి వెంకన్న గౌడ్, గౌడ జనహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు యోలికట్టే విజయ్కుమార్ గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వంగ సదానందం గౌడ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.దుర్గయ్యగౌడ్, బీసీ రచయితల సంఘం అధ్యక్షుడు బైరు శేఖర్ మాట్లాడారు.
కల్తీ కల్లు ఘటనను తాము సమర్థించడం లేదని, కానీ దీనిని సాకుగా చూపి రాష్ట్రంలో కల్లును నిషేధించడానికి కుట్రలు జరుగుతున్నాయని, దీనివల్ల 2.25 లక్షల మంది గీత కార్మికులు వీఽధిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతిలో కల్లు ఒక భాగమని దీనిని నిషేధిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై గౌడ కులస్తుల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్లు తక్షణమే స్పందించి కల్లు సొసైటీలపై దాడులు నిలిపి వేయాలన్నారు.
Updated Date - Jul 15 , 2025 | 05:24 AM