ఏవీఎస్ రాజు జీవితం యువతకు స్ఫూర్తి
ABN, Publish Date - Jun 16 , 2025 | 05:24 AM
నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్సీసీ) వ్యవస్థాపకులు అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (ఏవీఎస్ రాజు) జీవితం యువతరానికి స్ఫూర్తిపాఠం అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఏవీఎస్ రాజు జీవిత చరిత్ర.. స్టాండింగ్ టాల్, శిఖరాయమాణుడు పుస్తకాల ఆవిష్కరణ
శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు హాజరు
హైదరాబాద్ సిటీ, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్సీసీ) వ్యవస్థాపకులు అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (ఏవీఎస్ రాజు) జీవితం యువతరానికి స్ఫూర్తిపాఠం అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. నిర్మాణ రంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన ఏవీఎస్ రాజు ఆదర్శనీయుడని కొనియాడారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఎన్సీసీ అధినేత ఏవీఎస్ రాజు జీవిత చరిత్రపై వి.పట్టాభిరాం రాసిన ‘స్టాండింగ్ టాల్’ ఆంగ్ల పుస్తకాన్ని హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. స్టాండింగ్ టాల్కు తెలుగు అనువాదం డి.చంద్రశేఖర్ రెడ్డి రాసిన ‘శిఖరాయమాణుడు’ పుస్తకాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించి తొలిప్రతిని శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు వరప్రసాద్ రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విలువలు పాటించడం ద్వారా వ్యాపార సామ్రాజ్యాలు నిలబడతాయి అనేందుకు ఏవీఎస్ రాజు జీవితం నిదర్శనం అన్నారు. నిర్మాణ రంగంలో రాజు సాధించిన విజయాలే కాక, దేశాభివృద్ధిలో ఆయన భాగస్వామ్యాన్ని కూడా ఈ పుస్తకాలు తెలియజేస్తాయని పేర్కొన్నారు.
ఏదైనా నిర్మాణం చేపట్టేటప్పుడు ఓ చెట్టును తొలగించాల్సి వస్తే దానికి బదులుగా మరికొన్ని మొక్కలు నాటించి రాజు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. కంటి ఇన్ఫెక్షన్ బాధిస్తున్నా కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడు.. నేచర్, కల్చర్ కలిస్తే బ్రైట్ ఫ్యూచర్ సొంతమంటూ తనదైన శైలిలో ప్రసంగించారు. మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. వ్యాపార రంగంలోనే కాక కుటుంబ జీవితంలోనూ ఏవీఎస్ రాజు విజేతగా నిలిచారని కొనియాడారు. శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... సహనం, సహానుభూతి, ధార్మికసేవ వంటి సుగుణాలన్నింటితో మూర్తీభవించిన గొప్ప వ్యక్తి ఏవీఎస్ రాజు అని కొనియాడారు. ఇక, ఏవీఎస్ రాజుతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పంపిన సందేశాన్ని తెలంగాణ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ లింగం శ్రీధర్ చదివి వినిపించారు. కాగా, పుస్తక రచయితలు పట్టాభిరాం, చంద్రశేఖర్ రెడ్డిని ఏవీఎస్ రాజు కుటుంబసభ్యులు సత్కరించగా.. ఏవీఎస్ రాజు దంపతులను వక్తలు సన్మానించారు. కనుమూరి బాపిరాజు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అల్లు అరవింద్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Updated Date - Jun 16 , 2025 | 05:24 AM