Cyber Fraud: కంపెనీ ఎండీ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి.. కార్యాలయం ఉద్యోగి నుంచి 1.94 కోట్లు స్వాహా
ABN, Publish Date - Jul 26 , 2025 | 04:34 AM
ఓ కంపెనీ ఎండీ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి.. ఉద్యోగులను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు రూ. 1.94 కోట్లు కొల్లగొట్టారు. రంగంలోకి దిగిన నగరపోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు.
హైదరాబాద్ సిటీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : ఓ కంపెనీ ఎండీ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి.. ఉద్యోగులను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు రూ. 1.94 కోట్లు కొల్లగొట్టారు. రంగంలోకి దిగిన నగరపోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరు ఉత్తర్ప్రదేశ్కుచెందిన వైష్ణ, మరొకరు మధ్యప్రదేశ్కు చెందిన అజ్జు అలియాస్ అజయ్ సాహుగా పోలీసులు తేల్చారు. డీసీపీ కవిత తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన బాధితునికి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ వాట్సాప్ డీపీగా అతను పనిచేస్తున్న కంపెనీ ఎండీ ఫొటో ఉంది. ‘ఒక కొత్త ప్రాజెక్టు పనిలో బిజీగా ఉన్నాను.. నేను ఆఫీ్సకు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు వివరాలు తెలియజేస్తాను.’ అని ఆ మెసేజ్లో ఉంది. దానికి బాధితుడు సమాధానం ఇచ్చిన తర్వాత మరోసారి ఓ బ్యాంకు ఖాతా వివరాలు మెసేజ్ చేశారు.
కొత్త ప్రాజెక్టు నిమిత్తం 1.94 కోట్లు అవసరం అయ్యాయని వెంటనే బదిలీ చేస్తే కార్యాలయానికి వచ్చిన తర్వాత వివరంగా చెప్తానని ఆ మెసేజ్లో ఉంది. దాంతో నిజంగానే తన ఎండీ మెసేజ్ చేసినట్లు భావించిన బాధితుడు అందులో సూచించిన ఖాతాకు 1.94 కోట్ల కంపెనీ డబ్బు బదిలీ చేశాడు. ఆ తర్వాత తన ఎండీని కలవడంతో అసలు విషయం తెలిసింది. ఆయన ఎలాంటి మెసేజ్ చేయలేదని, ఏ ప్రాజెక్టు కోసం వెళ్లలేదని, ఆ నంబర్ ఆయనది కాదని తెలిసింది. దాంతో బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీపీ శివమారుతి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ప్రసాదరావు బృందం రంగంలోకి దిగింది. సాంకేతిక ఆధారాలతో ఈ మోసానికి పాల్పడింది యూపీకి చెందిన వైష్ణ, మధ్యప్రదేశ్కు చెందిన అజ్జు అలియాస్ అజయ్సాహుగా గుర్తించి అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు.
Updated Date - Jul 26 , 2025 | 04:34 AM