అనారోగ్యంతో మరణించినా.. బీమా చెల్లించాల్సిందే
ABN, Publish Date - Jun 12 , 2025 | 03:10 AM
ఓ గృహ రుణానికి సంబంధించిన పాలసీ విషయంలో బీమా సంస్థకు వ్యతిరేకంగా రాష్ట్ర వినియోగదారుల కీలక తీర్పు ఇచ్చింది.
రాష్ట్ర వినియోగదారుల ఫోరం కీలక తీర్పు
హైదరాబాద్ సిటీ, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): ఓ గృహ రుణానికి సంబంధించిన పాలసీ విషయంలో బీమా సంస్థకు వ్యతిరేకంగా రాష్ట్ర వినియోగదారుల కీలక తీర్పు ఇచ్చింది. పాలసీదారుడు అనారోగ్యంతో మరణించాడని సాకు చెప్పకుండా బీమా సొమ్ము మొత్తాన్ని సదరు సంస్థే రుణదాతకు చెల్లించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్, మలక్పేటకు చెందిన దొడ్డన్న గౌడ్ సుద్దాల పంజాబ్ నేషనల్ బ్యాంక్లో రూ.1,39,29,439 గృహ రుణం తీసుకున్నారు. దీనికి సంబంధించి టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్లో హౌసింగ్ బీమా పాలసీ తీసుకున్నారు. అయితే, అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన దొడ్డన్న గౌడ్ 2021 మే 5న చనిపోయారు.
దీంతో దొడ్డన్న గౌడ్ భార్య సుజాత బీమా సొమ్ము కోసం టాటా ఏఐజీ అధికారులను సంప్రదించగా.. పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తేనే పరిహారం చెల్లిస్తామని, అనారోగ్య కారణాలకు కాదని చెప్పి ఆమె వినతిని తిరస్కరించారు. దీనిపై సుజాత జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయగా.. బాధితురాలికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఫోరం.. పాలసీదారుడు తీసుకున్న రుణం చెల్లించి, ఇంటి పత్రాలను ఫిర్యాదుదారుకు అందించాలని తీర్పు ఇచ్చింది. అలాగే, రూ.లక్ష పరిహారం, రూ.25వేల ఖర్చులు చెల్లించాలని బీమా సంస్థను ఫోరం ఇన్చార్జి ప్రెసిడెంట్ మీనా రంగనాథన్, సభ్యులు వీవీ శేషుబాబు బెంచ్ ఆదేశించింది.
Updated Date - Jun 12 , 2025 | 03:10 AM