Osmania Hospital: ఉస్మా‘నయా’ ఆస్పత్రిలో హెలీప్యాడ్
ABN, Publish Date - Feb 01 , 2025 | 04:01 AM
అత్యవసర పరిస్థితుల్లో రోగిని తరలించడానికి వీలుగా కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలో హెలీప్యాడ్ రానుంది. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఆస్పత్రికి చేరుకునేందుకు స్కైవాక్ కూడా ఏర్పాటు కానుంది.
ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా స్కైవాక్
2700 కోట్లతో కొత్త భవనం
శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్
మూడేళ్లలోగా నిర్మాణం పూర్తి
41 ఆపరేషన్ థియేటర్లు, 2 వేల బెడ్లు, 500 పడకలతో ఐసీయూ
30 ప్రత్యేక వైద్య విభాగాలు
750 సీట్లతో ఆడిటోరియం మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్ సిటీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): అత్యవసర పరిస్థితుల్లో రోగిని తరలించడానికి వీలుగా కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలో హెలీప్యాడ్ రానుంది. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఆస్పత్రికి చేరుకునేందుకు స్కైవాక్ కూడా ఏర్పాటు కానుంది. నాలుగు దిక్కుల విశాలమైన రోడ్లతో ఆధునిక వసతులతో కొత్త ఆస్పత్రి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు హైదరాబాద్లోని గోషామహల్ పోలీసు స్టేడియంలో శుక్రవారం కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆస్పత్రి నిర్మాణ వివరాలను మీడియాకు వెల్లడించారు. రూ.2700 కోట్లతో నిర్మించే ఈ ఆస్పత్రిని రెండున్నరేళ్ల నుంచి మూడేళ్లలో పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 26.30 ఎకరాల్లో విశాలమైన ప్రాంగణంలో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆస్పత్రిని నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో 1168 పడకలు ఉన్నాయని, కొత్త ఆస్పత్రిలో 2 వేల పడకలు అందుబాటులో ఉంటాయని, ఇందులో 500 పడకల సామర్థ్యంతో ఐసీయూను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆస్పత్రిలో ప్రస్తుతం 22 వైద్య విభాగాలు ఉండగా.. వాటిని 30కి పెంచుతున్నామని చెప్పారు. సుమారు 41 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోనే డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలు ఉంటాయని వివరించారు. విద్యార్థులు, ఫ్యాకల్టీకి అధునాతన వసతులతో కూడిన హాస్టల్ సదుపాయం, 750 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం, క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 3 వేల వాహనాలు ఒకేసారి పార్కింగ్ చేసుకునేలా అండర్గ్రౌండ్ పార్కింగ్ సిస్టమ్ ఉంటుందన్నారు. రాబోయే వందేళ్లు ప్రజలు గుర్తుంచుకునేలా అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికతతో ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. 1919 నుంచి వందేండ్లకు పైగా ఇక్కడి ప్రజలకు ఉస్మానియా ఆస్పత్రితో అనుబంధం ఉందని, ఇక్కడి వాళ్లకు ఆస్పత్రిని దూరం చేయకుండా ఇక్కడే నిర్మిస్తున్నామన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అడ్మినిస్ట్రేషన్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టాలనే యోచన చేస్తున్నామని, ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలోనే ఈ విధానం ఉందని మంత్రి దామోదర తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఎక్కువగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉంటుందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఈ విధానాన్ని అమ లు చేయనున్నట్లు చెప్పారు. ఇందులో అందరికీ బాధ్యతలు అప్పగించి ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయనున్నామని ఆయన చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
సచిన్కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్
ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు
చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 01 , 2025 | 04:01 AM