CM Revanth Reddy: పోలీసులు తెలిపినవి అవాస్తవాలు
ABN, Publish Date - May 23 , 2025 | 04:41 AM
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఎక్కడా ఎలాంటి తప్పూ చేయలేదని.. కోడ్ ఉల్లంఘన కేసుల విషయంలో పోలీసులు తెలిపిన వివరాలు అవాస్తవాలని సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టుకు తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో నేను ఎక్కడా ఏ తప్పూ చేయలేదు
గత ప్రభుత్వ ఒత్తిడితో నాపై తప్పుడు కేసులు పెట్టారు
కోడ్ ఉల్లంఘన కేసుల్లో సీఎం రేవంత్ వాంగ్మూలం
నాంపల్లి కోర్టుకు హాజరు.. వచ్చే నెల 12న తుది తీర్పు
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఎక్కడా ఎలాంటి తప్పూ చేయలేదని.. కోడ్ ఉల్లంఘన కేసుల విషయంలో పోలీసులు తెలిపిన వివరాలు అవాస్తవాలని సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టుకు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారనే అభియోగాలతో.. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడైన రేవంత్పై బేగంబజార్, నల్లగొండ టూటౌన్, మెదక్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఈ కేసులపై తన వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు రేవంత్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి వచ్చారు. ఈ కేసు విచారణలో భాగంగా గతంలోనూ ఒకసారి రేవంత్ కోర్టుకు వచ్చి తన వాదన వినిపించారు.
తాజాగా మరోసారి ఆయన వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. అప్పటి ప్రభుత్వం ఒత్తిడి మేరకు తనపై తప్పుడు కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి అందులో చెప్పారు. కాగా.. గురువారం రేవంత్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం, ఇంతటితో ఈ కేసులో వాదనలు పూర్తయినట్టు న్యాయస్థానం తెలిపింది. వచ్చే నెల 12వ తేదీన ఈ కేసులకు సంబంధించి తుది తీర్పును వెల్లడించనున్నట్టు ప్రకటించింది. ఇక, రేవంత్ కోర్టుకు వస్తున్నందున పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కోర్టు హాల్ వద్ద ఇతరులెవరినీ అనుమతించలేదు.
Updated Date - May 23 , 2025 | 04:41 AM