Corruption: ధాన్యం టెండర్లలో భారీ కుంభకోణం జరిగింది!
ABN, Publish Date - Jul 30 , 2025 | 04:49 AM
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని, ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన డబ్బులు.. ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లాయని బీఆర్ఎస్ నేతలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఫిర్యాదు చేశారు.
రేవంత్, ఉత్తమ్, అధికారుల పాత్ర
ఈడీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
హైదరాబాద్, జూలై 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని, ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన డబ్బులు.. ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లాయని బీఆర్ఎస్ నేతలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఫిర్యాదు చేశారు. 18 నెలల కిందట జరిగిన ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, పౌర సరఫరాల కమిషనర్, అధికారుల పాత్ర ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గంగుల కమలాకర్ మంగళవారం ఈడీ కార్యాలయంలో అధికారులను కలిసి ఫిర్యాదు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. బిడ్డర్లు ధాన్యం టన్నుకు రూ.2,230 ఎక్కువగా రైస్ మిల్లర్ల నుంచి వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారని ఆరోపించారు.
రూ.423 కోట్లు అక్రమంగా వివిధ ఖాతాల్లోకి బదిలీ అయ్యాయన్నారు. త్వరలో సీబీఐ, డీఆర్ఐకు కూడా ఫిర్యాదు చేస్తామని, 700 పేజీల బుక్లెట్ తయారుచేసి దర్యాప్తు సంస్థలకు పంపుతామని చెప్పారు. ఈ కుంభకోణంపై బీజేపీ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి ఇప్పటికైనా నోరు తెరవాలని డిమాండ్ చేశారు. పౌర సరఫరాల శాఖలో ధాన్యం కొనుగోళ్లలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, అందుకు కారకులైన సీఎం రేవంత్ రెడ్డి, ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని కోరుతూ ఏసీబీకి బీఆర్ఎస్ నేత, రెడ్కో మాజీ చైర్మన్ సతీ్షరెడ్డి ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.1,100 కోట్ల అవినీతి జరిగిందని, దానికి సాక్ష్యాలు అంటూ 175 పేజీల డాక్యుమెంట్లను ఏసీబీ అందజేశారు.
Updated Date - Jul 30 , 2025 | 04:49 AM