రూ. 1.2 కోట్ల హాషిష్ ఆయిల్ పట్టివేత
ABN, Publish Date - Jun 12 , 2025 | 04:42 AM
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్న 20 కిలోల హాషిష్ ఆయిల్(ద్రవరూప గంజాయి)ని రాచకొండ పోలీసులు సీజ్ చేశారు.
ఇద్దరి అరెస్టు.. పరారీలో మరో ఇద్దరు
నిందితుల్లో ఒకరు ఆర్టీయే ఏజెంట్
హైదరాబాద్ సిటీ, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్న 20 కిలోల హాషిష్ ఆయిల్(ద్రవరూప గంజాయి)ని రాచకొండ పోలీసులు సీజ్ చేశారు. దీని విలువ రూ.1.2 కోట్లుగా ఉంటుందని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. మంగళవారం రాత్రి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వద్ద లారీ దిగి.. అనుమానాస్పద స్థితిలో ఆటోరిక్షా ఎక్కేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, అబ్దుల్లాపూర్మెట్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డిల నేతృత్వంలోని బృందాలు అదుపులోకి తీసుకున్నాయి.
తదుపరి దర్యాప్తులో.. వారిద్దరిని ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా హుకుంపేటకు చెందిన పంగి కేశవరావు అలియాస్ కేశ, ఒడిసాకు చెందిన జయరాం కెముండుగా గుర్తించాయి. ఆరి వద్ద 20 కిలోల బరువున్న హాషిష్ ఆయిల్ను సీజ్ చేశాయి. దీని విలువ రూ.1.2 కోట్లుగా ఉంటుంది. గంజాయి స్మగ్లింగ్లో అనుభవమున్న కేశవరావుకు అతని బాల్య మిత్రుడు, ఆర్టీయే ఏజెంట్ కృష్ణ ద్వారా జయరాం పరిచయం అయ్యాడు. వీరంతా ఏపీ నుంచి బెంగళూరుకు హాషిష్ ఆయిల్ను సరఫరా చేయడం మొదలు పెట్టారు. కేశవరావును గతంలో గంజాయి కేసులో అనకాపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు లారీలు, ఆటోరిక్షాలను మారుస్తూ.. బెంగళూరులో ఓ పెడ్లర్కు సరుకును పంపేవారు. కేశవరావు, జయరాం అరెస్టవ్వగా.. కృష్ణ, బెంగళూరుకు చెందిన పెడ్లర్ పరారీలో ఉన్నట్లు సీపీ వివరించారు.
Updated Date - Jun 12 , 2025 | 04:42 AM