Microsoft Agentic OS వస్తోందంటూ మైక్రోసాఫ్ట్ విండోస్ చీఫ్ ప్రకటన.. మండిపడుతున్న జనాలు
ABN, Publish Date - Nov 13 , 2025 | 09:01 PM
విండోస్ ఏజెంటిక్ ఓఎస్ వస్తోందంటూ సంస్థ చీఫ్ చేసిన ప్రకటనపై జనాలు మండిపడుతున్నారు. ఓఎస్లోని మౌలిక సమస్యలను ముందు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇది ఏఐ యుగం. ఏఐ సాంకేతికతను టెక్ సంస్థలు తమ ఉత్పత్తులు అన్నింటిలో జొప్పిస్తున్నాయి. ఇప్పటికే ఏఐ సాంకేతికత బ్రౌజర్లలో నేరుగా అందుబాటులో ఉంటోంది. ఏఐ ఆధారిత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించేందుకు మైక్రోసాఫ్ట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యూజర్లకు కావాల్సిన పనులను స్వతంత్రంగా చేసిపెట్టే ఏజెంటిక్ ఆపరేటింగ్ సిస్టమ్లా విండోస్ మారుతోందని ఆ విభాగం చీఫ్ తాజాగా ఎక్స్లో వెల్లడించారు. దీంతో, జనాలు మండిపడుతున్నారు.
చాట్జీపీటీలా చెప్పిన పనులన్నీ చకచకా చేసుకుపోయే ఏజెంటిక్ ఓఎస్పై జనాలు ఊహించని రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఏజెంటిక్ ఓఎస్ కావాలని ఎవరు అడిగారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
మైక్రాసాఫ్ట్ సంస్థ తన కస్టమర్లను అర్థం చేసుకోలేక పోతోందన్న విమర్శలు నెట్టింట వెల్లువెత్తాయి. ఇప్పటికే అనవసర యాడ్స్, మార్పులతో విండోస్ జనాలకు ఇబ్బందికరంగా మారిందని కొందరు అన్నారు. మైక్రోసాఫ్ట్ అకౌంట్, వన్ డ్రైవ్, కోపైలట్ ఇలా అన్నింట్లో డబ్బు కోసం ఏఐని ప్రవేశపెడుతోందని అన్నారు. విండోస్కు డబ్బు చెల్లిస్తున్నందున తమకు ఇలాంటివి అవసరం లేదని అన్నారు. నిరంతర అప్డేట్స్ పరంపర కారణంగా విండోస్ ఓఎస్ అస్థిరంగా మారుతోందని, అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పారు.
బగ్స్తో నిండిపోయిన సాఫ్ట్వేర్లా విండోస్ మారిపోతోందని కూడా కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారుల ప్రైవెసీకి పెద్ద పీట వేస్తూ వేగవంతమైన, స్థిరమైన ఓఎస్ కావాలని జనాలు డిమాండ్ చేశారు. ఓఎస్కు సంబంధించిన మౌలిక అంశాలను ముందు మెరుగుపరచాలని కుండబద్దలు కొట్టారు.
ఇవి కూడా చదవండి
టాప్ 100 యాప్స్ జాబితాలో అరట్టైకి దక్కని చోటు.. స్పందించిన శ్రీధర్ వెంబు
ఏఐతో మానసిక బంధంపై పర్ప్లెక్సిటీ సీఈఓ హెచ్చరిక
Read Latest and Technology News
Updated Date - Nov 13 , 2025 | 09:07 PM