AB de Villiers: కోహ్లీతో కొన్ని నెలల పాటు మాటలు బంద్.. కారణం చెప్పిన ఏబీ డివిలియర్స్
ABN, Publish Date - Jun 15 , 2025 | 08:10 PM
విరాట్ కోహ్లీకి తనకు కొన్ని నెలల పాటు మాటలు లేవని స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అన్నారు. ఇందుకు గల కారణం కూడా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ కోహ్లీకి తనకు మధ్య కొన్ని నెలల పాటు మాటలు లేవని దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ తాజాగా తెలిపారు. అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ విషయాన్ని బహిరంగంగా చెప్పడమే దీనికి కారణం అయి ఉండొచ్చని అన్నారు. గతేడాది ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్కు విరాట్ కోహ్లీ గైర్హాజరయ్యారు. ఇందుకు కారణం అనుష్క ప్రెగ్నెన్సీ అని డివిలియర్స్ చెప్పడం అప్పట్లో కలకలం రేపింది. అయితే, తాను పొరబడ్డానని డివిలియర్స్ ఆ తరువాతి వీడియోలో వివరణ ఇచ్చుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఐపీఎల్లో ఆర్సీబీ విజయం సాధించిన నేపథ్యంలో కోహ్లీ, డివిలియర్స్ మళ్లీ కలుసుకున్నారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం సరదాగా సంభాషించుకున్నారు. అయితే, గత కొన్ని నెలల క్రితమే తనకు, కోహ్లీకి మధ్య మాటలు మొదలయ్యాయని డివిలియర్స్ తెలిపారు.
‘మా ఇద్దరిదీ ఒకే బోటు ప్రయాణం. గత ఆరు నెలలుగా కోహ్లీ నాతో టచ్లోనే ఉన్నాడు. అయితే, అతడు నాతో మళ్లీ మాట్లాడటం నాకు ఊరటనిచ్చింది. కోహ్లీ గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయంలో బౌన్స్ బ్యాక్ కోసం నాతో సంప్రదించాడు. అతడి పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. వయసు, ఆట తీరు, అనుభవం వంటి వన్నీ అర్థం చేసుకోగలను. ఇలాంటి సమయాల్లో ఎన్నో అంశాల కారణంగా ప్లేయర్పై భారం పెరుగుతుంది. నేను ఓ దశలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కున్నా. దీంతో, నా అనుభవాలను పంచుకున్నా. అతడి ఆట తీరును పరిశీలించాక నా మనసుకు అనిపించింది చెప్పా. అయితే, కోహ్లీ ఇంకా క్రికెట్లో కొనసాగుతుండటం నాకు ఊరటనిచ్చే అంశం. అతడికి నా మద్దతు 100 శాతం ఉంటుంది’ అని డివిలియర్స్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
బుమ్రాతో అలాంటి పని మాత్రం చేయించొద్దు.. టీమిండియాకు గంగూలీ సూచన
అభిమానుల నుంచి అలాంటి ప్రేమ నాకెప్పుడూ దక్కలేదు: నొవాక్ జకోవిచ్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 15 , 2025 | 08:20 PM