PBSK vs MI: పంజాబ్ ఘన విజయం..
ABN, Publish Date - Jun 02 , 2025 | 08:09 AM
ఉత్కంఠభరితంగా సాగిన క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. తమ చివరి మ్యాచ్లో కేవలం 101 పరుగులకే కుప్పకూలిన ఈ జట్టు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్లో మాత్రం విజృంభించింది.
అహ్మదాబాద్: ఉత్కంఠభరితంగా సాగిన క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. తమ చివరి మ్యాచ్లో కేవలం 101 పరుగులకే కుప్పకూలిన ఈ జట్టు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్లో మాత్రం విజృంభించింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్ కారణంగా.. ఆదివారం ముంబై ఇండియన్స్పై పంజాబ్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా ఈనెల 3న జరిగే ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్యకుమార్ (44), తిలక్ వర్మ (44), బెయిర్స్టో (38), నమన్ (37) రాణించారు. ఒమర్జాయ్కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారీ ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసి నెగ్గింది. నేహల్ (48), ఇన్గ్లి్స (38) ఆకట్టుకున్నారు. అశ్వనికి రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు.
శ్రేయాస్ ధనాధన్: కెప్టెన్ శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్తో భారీ ఛేదనలో పంజాబ్ దూసుకెళ్లింది. మిడిలార్డర్ అద్భుతంగా రాణించడంతో లక్ష్యం వైపు వేగంగా సాగింది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ (6) నిరాశపర్చగా.. ఇన్గ్లి్స ఆరంభంలో చెలరేగాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో తను 4,6,4,6తో 20 పరుగులు రాబట్టాడు. ఆరో ఓవర్లో ప్రియాన్ష్ (20) వెనుదిరిగినా పవర్ప్లేలో 64/2 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత మూడు ఓవర్లలో వీరి ఆట నెమ్మదించగా ఇన్గ్లి్స వికెట్ కూడా కోల్పోయింది. అయితే నేహల్-శ్రేయాస్ జోడీ ముంబై బౌలర్లపై జోరు చూపింది. 13వ ఓవర్లో శ్రేయాస్ హ్యాట్రిక్ సిక్సర్లతో విజృంభించాడు. అటు బౌల్ట్ ఓవర్లో నేహల్ రెండు ఫోర్లు సాధించడంతో ముంబైలో ఉత్కంఠ పెరిగింది. అయితే 16వ ఓవర్లో నేహల్ను స్పిన్నర్ అశ్వని అవుట్ చేయడంతో నాలుగో వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు శ్రేయాస్ మాత్రం 27 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేశాడు. శశాంక్ (2) రనౌట్ కాగా 18వ ఓవర్లో బుమ్రా 8 పరుగులే ఇచ్చాడు. కానీ 19వ ఓవర్లో శ్రేయాస్ నాలుగు సిక్సర్లతో 26 పరుగులు రాబట్టి మ్యాచ్ను ముగించాడు.
కలిసికట్టుగా..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇన్నింగ్స్ మెరుపు వేగంతో సాగింది. ఓపెనర్ రోహిత్ (8) మూడో ఓవర్లోనే వెనుదిరిగినా.. బెయిర్స్టో-తిలక్ జోడీ ఎదురుదాడికి దిగింది. అటు సూర్యకుమార్.. చివర్లో నమన్ ధిర్ తుఫాన్ ఇన్నింగ్స్తో జట్టు భారీ స్కోరు అందుకుంది. వన్డౌన్లో బరిలోకి దిగిన తిలక్ వచ్చీ రావడంతోనే రెండు సిక్సర్లతో చెలరేగాడు. ఆరో ఓవర్లో బెయిర్స్టో 4,6తో పవర్ప్లేలో జట్టు 65/1 స్కోరుతో నిలిచింది. కానీ తర్వాతి ఓవర్లోనే వైశాక్ నకుల్ బాల్కు బెయిర్స్టో వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత తిలక్కు సూర్యకుమార్ జత కట్టడంతో రన్రేట్ పది రన్స్కు తగ్గకుండా సాగింది. స్పిన్నర్ చాహల్ లక్ష్యంగా సూర్య పదో ఓవర్లో 6,4.. 12వ ఓవర్లో మరో సిక్సర్తో ధాటిని కనబర్చాడు. అయితే ఎడాపెడా షాట్లతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీకి చాహల్ చెక్ పెట్టాడు. 14వ ఓవర్లో సూర్య 4,6 బాదినా ఐదో బంతికి వెనుదిరిగాడు. అప్పటికే మూడో వికెట్కు 72 పరుగులు జత చేరాయి. తర్వాతి ఓవర్లోనే తిలక్కు పేసర్ జేమిసన్ షాకిచ్చాడు. కాసేపటికే కెప్టెన్ హార్దిక్ (15)ను ఓ బౌన్సర్తో పేసర్ ఒమర్జాయ్ అవుట్ చేశాడు. కానీ నమన్ ధిర్ మాత్రం చివర్లో బౌండరీలతో జోరు చూపాడు. ఆఖరి ఓవర్లో తను అవుటైనా ముంబై 200 స్కోరు దాటగలిగింది.
రెండున్నర గంటలు ఆలస్యంగా..
వర్షం కారణంగా ఈ మ్యాచ్ నిర్ణీత సమయంకన్నా రెండున్నర గంటలు ఆలస్యంగా ఆరంభమైంది. టాస్ వేసేటప్పుడు వాతావరణం మెరుగ్గానే ఉన్నా సరిగ్గా మ్యాచ్ సమయానికి వర్షం ఆరంభమైంది. దీంతో ఎలాంటి ఓవర్ల కోత లేకుండా రాత్రి 9.45కి మ్యాచ్ ఆరంభమైంది.
స్కోరుబోర్డు..
ముంబై: రోహిత్ (సి) వైశాఖ్ (బి) స్టొయినిస్ 8, బెయిర్స్టో (సి) ఇంగ్లిస్ (బి) వైశాఖ్ 38, తిలక్ (సి) ప్రియాన్ష్ (బి) జేమీసన్ 44, సూర్యకుమార్ (సి) వధేరా (బి) చాహల్ 44, హార్దిక్ (సి) ఇంగ్లిస్ (బి) ఒమర్జాయ్ 15, నమన్ (సి) స్టొయినిస్ (బి) ఒమర్జాయ్ 37, రాజ్ బవ (నాటౌట్) 8, శాంట్నర్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 203/6; వికెట్ల పతనం: 1-19, 2-70, 3-142, 4-142, 5-180, 6-197; బౌలింగ్: అర్ష్దీప్ 4-0-44-0, జేమీసన్ 4-0-30-1, స్టొయినిస్ 1-0-14-1, ఒమర్జాయ్ 4-0-43-2, విజయ్కుమార్ వైశాఖ్ 3-0-30-1, చాహల్ 4-0-39-1.
పంజాబ్: ప్రియాన్ష్ (సి) హార్దిక్ (బి) అశ్వని కుమార్ 20, ప్రభ్సిమ్రన్ (సి) టోప్లే (బి) బౌల్ట్ 6, ఇంగ్లిస్ (సి) బెయిర్స్టో (బి) హార్దిక్ 38, శ్రేయాస్ (నాటౌట్) 87, నేహల్ (సి)శాంట్నర్ (బి) అశ్వని కుమార్ 48, శశాంక్ (రనౌట్) 2, స్టొయినిస్ (నాటౌట్) 2, ఎక్స్ట్రాలు: 4; మొత్తం: 19 ఓవర్లలో 207/5; వికెట్ల పతనం: 1-13, 2-55, 3-72, 4-156, 5-169; బౌలింగ్: బౌల్ట్ 4-0-38-1, టోప్లే 3-0-40-0, బుమ్రా 4-0-40-0, అశ్వని కుమార్ 4-0-55-2, శాంట్నర్ 2-0-15-0, హార్దిక్ 2-0-19-1.
రికార్డ్స్..
ఐపీఎల్ సీజన్లో ఓపెనర్గా ఆడకుండానే ఎక్కువ పరుగులు (717) సాధించిన బ్యాటర్గా సూర్యకుమార్.
ఐపీఎల్ ప్లేఆఫ్స్లో ఒక్క ఆటగాడి హాఫ్ సెంచరీ లేకుండానే ఓ జట్టు (ముంబై) 200+ స్కోరు సాధించడం ఇదే తొలిసారి.
Also Read:
రోడ్డు ప్రమాదంలో 21 మంది క్రీడాకారుల బలి
ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు
For More Sports News and Telugu News..
Updated Date - Jun 02 , 2025 | 08:09 AM