IPL 2025 SRH VS MI: టాప్ త్రీ స్థానానికి ముంబై ఇండియన్స్.. సన్రైజర్స్కు మళ్లీ నిరాశే
ABN, Publish Date - Apr 23 , 2025 | 10:47 PM
వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో విజయం చేరింది. సన్రైజర్స్ హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో విజయం చేరింది. సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)పై ఘన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ టీమ్తో (SRH vs MI) సన్రైజర్స్ తలపడింది. సన్రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన లక్ష్యాన్ని ముంబై సునాయాసంగా ఛేదించింది (IPL 2025). రోహిత్ శర్మ (46 బంతుల్లో 70) మరో అర్ధశతకం సాధించాడు
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ బ్యాటింగ్కు దిగింది. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో ఓవర్లోనే ట్రావిస్ హెడ్ (0) అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో ఇషాన్ కిషన్ (1) బంతి బ్యాట్కు తగిలిందనుకుని తనకు తానుగా మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. అయితే రీప్లేలో బంతి బ్యాట్కు తగల్లేదని తేలింది. ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (8) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి (2) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు.
టాపార్డర్లో నలుగురు బ్యాటర్లలో ఒక్కరూ కూడా పది పరుగులు చేయలేకపోయారు. టాపార్డర్ విఫలమైనా హెన్రిచ్ క్లాసెన్ (71) అర్ధశతకంతో ఆదుకోవడంతో సన్రైజర్స్ హైదరాబాద్ కోలుకుంది. అతడికి అభినవ్ మనోహర్ (43) సహకరించాడు. వీరిద్దరూ ఆరో వికెట్కు 99 పరుగులు జోడించారు. దీంతో సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు తీశాడు. దీపక్ ఛాహర్ రెండు వికెట్లు తీశాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
సన్రైజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ (70) తన ఫామ్ను కొనసాగించి అదిరిపోయే అర్ధశతకం సాధించాడు. అతడికి విల్ జాక్స్ (22), సూర్యకుమార్ యాదవ్ (40) సహకరించారు. దీంతో ముంబై 15.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 23 , 2025 | 10:49 PM