IPL 2025: కర్ణాటక సీఎం టు రణ్వీర్ సింగ్.. ఆర్సీబీ విజయంపై ప్రముఖులు ఏమన్నారంటే..
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:02 PM
IPL 2025: ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత తొలిసారి విజయం సాధించటంపై రాజకీయ, సినీ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లులు కురిపించారు.
18 ఏళ్ల అవిశ్రాంత పోరాటం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025లో విజయం సాధించింది. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో గెలిచింది. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ 10 సార్లు ప్లేఆఫ్కు వెళ్లింది. ఆ పదిలో నాలుగు సార్లు ఫైనల్కు చేరుకుంది. 2009, 2011, 2016లో ఫైనల్ వరకు వెళ్లింది. కానీ, కప్పు గెలవలేకపోయింది. ఈ సారి మాత్రం వీరోచితంగా పోరాడి గెలుపును కైవసం చేసుకుంది. ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత తొలిసారి విజయం సాధించటంపై రాజకీయ, సినీ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లులు కురిపించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య స్పందిస్తూ... ‘ ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ టీమ్ను ఓడించి కప్ గెలుచుకున్న ఆర్సీబీ టీమ్కు అభినందనలు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచి కోట్లాది మంది అభిమానుల కలను ఆర్సీబీ ఆటగాళ్లు నెరవేర్చారు. ఆర్సీబీ విజయంలో విరాట్ కోహ్లీ 18 ఏళ్ల తపస్సు ఉంది. ప్రతీ ఒక్క ఆర్సీబీ ఆటగాడు చాంపియన్ ప్రదర్శన ఇచ్చారనటంలో ఎలాంటి అనుమానం లేదు’
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం మోహన్ యాదవ్...‘ఐపీఎల్లో తొలిసారి విజయం సాధించిన ఆర్సీబీకి అభినందనలు. కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలో కప్పు గెలవటం సంతోషంగా ఉంది. మధ్యప్రదేశ్ వారికి ఇది గర్వకారణం’
డీకే శివకుమార్ స్పందిస్తూ.. ‘ఇది విజయం కాదు.. అంతకు మించింది. ఇవి భావోద్వేగ క్షణాలు..’
హీరో వెంకటేష్ స్పందిస్తూ.. ‘ఆర్సీబీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 18 ఏళ్ల ఎదురుచూపునకు ముగింపు చెప్పినందుకు సంతోషంగా ఉంది. ఈ విజయానికి మీరు నిజంగా అర్హులే’
ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ.. ‘ ఎదురు చూపు ముగిసింది. ఈ సాల కమ్ నమదే.. 18 ఏళ్లుగా ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాం. అభినందనలు..’
రష్మిక స్పందిస్తూ.. ‘ ఆర్సీబీ గెలుపు సువాసనలు ఇక్కడకు విరజిమ్ముతున్నాయి’
విజయ్ దేవరకొండ స్పందిస్తూ..‘ఆర్సీబీ టీమ్తో పాటు ఫ్యాన్స్ అందరికీ అభినందనలు. ఈ రోజ కోసమే ఎంతో ఆశగా ఎదురు చూశారు. సంతోషకరమైన క్షణాలు’
సుధీర్ బాబు స్పందిస్తూ.. ‘ ఇదొక చారిత్రాత్మక విజయం. 18 ఏళ్ల కల నెరవేరింది. ఆర్సీబీ టీమ్కు అభినందనలు’
సాయి దుర్గా తేజ్ స్పందిస్తూ.. ‘ ఎన్నో ట్రోల్స్, ఓటములు.. అన్నిటీ తట్టుకుని ముందుకు సాగారు. కప్పును గెలుచుకున్నారు. ఆర్సీబీకి శుభాకాంక్షలు’
రణ్వీర్ సింగ్ స్పందిస్తూ.. ‘ఇన్నేళ్లుగా ఎదురుచూసింది దీనికోసమే కదా..’
Updated Date - Jun 04 , 2025 | 12:52 PM