Folk Singer: రూ. 5 వేల కోసం ఫోక్ సింగర్ దారుణ హత్య..
ABN, Publish Date - Jul 14 , 2025 | 01:42 PM
Folk Singer: మొత్తం 11 మంది మారుతీపై కత్తులతో దాడి చేశారు. అనంతరం అతడిపైనుంచి కారు పోనిచ్చారు. మారుతీ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సమయంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది.
ఆర్థిక లావాదేవీల విషయంలో జరిగే గొడవలు ప్రాణాలు తీస్తున్నాయి. చిల్లర డబ్బుల కంటే.. ఓ మనిషి ప్రాణం ఎందుకూ పనికిరాకుండా పోతోంది. తాజాగా, 5 వేల అప్పు ఓ ఫోక్ సింగర్ ప్రాణం తీసింది. అప్పు ఇచ్చిన వ్యక్తి తన మనుషులతో ఫోక్ సింగర్ను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లాలోని రాయబాగ్ తాలూకాకు చెందిన మారుతీ ఆదివప్ప లాతే ఫోక్ సింగర్గా ఆ ప్రాంతంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అతడు ఉత్తర కన్నడ యాసలో ఫోక్ సాంగ్స్ పాడేవాడు. ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేసేవాడు. మారుతీ కొన్ని నెలల క్రితం ఈరప్ప అక్కినే అనే వ్యక్తి దగ్గర 5 వేలు అప్పు తీసుకున్నాడు. ఇస్తానన్న సమయానికి ఇవ్వలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే 5 వేల కోసం మారుతీ, ఈరప్పల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ గొడవలు గత కొద్దిరోజుల నుంచి తారాస్థాయికి చేరాయి. మారుతీపై కక్ష గట్టిన ఈరప్ప మర్డర్ ప్లాన్ వేశాడు. తన గ్యాంగ్ను రంగంలోకి దింపాడు.
జూలై 13వ తేదీన మారుతీ తన స్నేహితుడితో కలిసి బైకుపై వెళుతూ ఉన్నాడు. బుధిహాల్ గ్రామం దగ్గర ఈరప్ప గ్యాంగ్ కారులో మారుతీని అడ్డగించింది. మొత్తం 11 మంది మారుతీపై కత్తులతో దాడి చేశారు. అనంతరం అతడిపైనుంచి కారు పోనిచ్చారు. మారుతీ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సమయంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఓ ఇద్దరు నిందితులకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారిద్దరూ ప్రస్తుతం గోకక్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, రాయ్బాగ్ పోలీస్ స్టేషన్లో 11 మందిపై కేసు నమోదు అయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
శోభనం గదిలో వరుడు చేసిన పనికి వధువు షాక్..
హీరో ఆర్య సినిమా షూటింగ్లో విషాదం.. ఆర్టిస్ట్ మృతి
Updated Date - Jul 14 , 2025 | 01:48 PM