Minister Seethakka: మేడారంలో సమ్మక్క సారలమ్మలకు మంత్రి సీతక్క పూజలు
ABN, Publish Date - Feb 13 , 2025 | 09:56 AM
ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో సమ్మక్క సారలమ్మల మినీ జాతర ఘనంగా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు ఈ జాతరకు హాజరు అవుతారు. అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు.
మేడారంలో సమ్మక్క సారక్కల మినీజాతర ఘనంగా జరుగుతోంది. మంత్రి సీతక్క సమ్మక్క సారక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు.
బుధవారం రాత్రి పూజారులు సమ్మక్క పూజ మందిరం నుంచి పసుపు, కుంకుమ, నైవేధ్యం తీసుకువచ్చి సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద సమర్పించారు.
డోలు వాయిద్యాలు, కొమ్ము శబ్దాల నడుమ మహిళలు నీళ్లు ఆరబోస్తుండగా వడ్డెలు (పూజారులు) గద్దెల వద్దకు చేరుకొని జాగారం చేశారు.
మండమెలిగె పండుగ సందర్భంగా తల్లుల గద్దెలను దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
తొలిరోజు సుమారు 2.5 లక్షల మంది మేడారం చేరుకున్నట్లు అధికారులు అంచనా వేశారు.
గురువారం ఉదయం సూర్యోదయానికి ముందు పూజారులు వనదేవతల మందిరాలకు చేరుకొని తల్లులకు శనివారం వరకు అంతర్గత పూజాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు.
మూడు రోజులపాటు జరుగనున్న జాతరకు జిల్లా వాసులతోపాటు పొరుగు జిల్లాల భక్తులు ఇక్కడకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి, మొక్కులు చెల్లించుకుంటారు.
వనదేవతల అంతర్గత మందిరాల్లో సమ్మక్కకు సిద్దబోయిన వంశీయులు, సారలమ్మకు కాకతీయ వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జాతరలో కొంతమంది భక్తులు అమ్మవార్లకు మొక్కి బలిచ్చే మేకలు, కోళ్లను హలాల్ చేయవద్దని మేడారం ప్రధాన పూజారి అరుణ్ కుమార్ సూచించారు. హలాల్ చేయడం సంస్కృతీ, సాంప్రదాయాలకు విరుద్ధమని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు గిరిజన సంస్కృతీ, సాంప్రదాయాలను తప్పక గౌరవించాలని కోరారు.
జాతరకు తెలంగాణ ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులు విడుదల చేయగా.. కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
సమ్మ క్క, సారలమ్మను భక్తులు దర్శించకున్నారు. తొలుత గద్దెల ఎదుట ఏర్పాటు చేసిన తులాభారం వద్ద భక్తులు ఎత్తు బంగారం సమర్పించారు. అనంతరం గద్దెలకు చేరుకొని చీర, గాజులు, పసుపు, కుంకుమను తల్లులకు సమర్పించారు.
అమ్మవారికి తలనీలాలు సమర్పించి పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లంతో, కుంకుమ భరిణెలను మొక్కులుగా చెల్లిస్తారు. ఇలా చేస్తే తమ కష్టాలన్నీ అమ్మవార్లు తీరుస్తారని భక్తులు విశ్వసిస్తారు.
జాతరకు వీవీఐపీల తాకిడి పెరగడంతో సాధారణ భక్తులు దర్శనం చేసుకోవడానికి కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు.
Updated Date - Feb 14 , 2025 | 07:20 AM