Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దౌత్య బృందాల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రజాప్రతినిధులు
ABN, Publish Date - May 24 , 2025 | 10:06 PM
ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురు, తెలంగాణ నుండి ఒక ప్రజాప్రతినిధి విదేశీ పర్యటనపై వెళ్లారు.
విదేశీ పర్యటనలో పురందేశ్వరి, హరీష్ బాలయోగి, కృష్ణ దేవరాయులు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్ ఉగ్రవాద ఉన్మాదాన్ని ప్రపంచంలోని కీలక దేశాలకు తెలియచెప్పేందుకు ఉద్దేశించిన అఖిలపక్ష పార్లమెంటరీ బృందాల విదేశీ పర్యటన మొదలయ్యింది. 51 మంది పార్లమెంటేరియన్లు, రాజకీయ నాయకులు, 8 మంది మాజీ రాయబారులతో కూడిన మొత్తం ఏడు బృందాలు ప్రపంచవ్యాప్తంగా కీలక దేశాలు, భద్రత మండలి సభ్య దేశాలలో పర్యటిస్తుండగా అందులో ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురు, తెలంగాణ నుండి ఒకరు ఉన్నారు. వీరందరికీ న్యూ ఢిల్లీలో విదేశాంగ శాఖ అధికారులు విదేశీగడ్డపై విదేశీ నేతలతో మాట్లాడే విధానం గురించి వివరించారు.
కీలకమైన సౌదీ అరేబియాతో పాటు కువైత్, బహ్రెయిన్ దేశాల పర్యటనకు ఒడిశా బీజేపీ ఎంపీ బైజయంత్ జయ పండే నేతృత్వంలో వచ్చిన ఏడుగురు సభ్యుల బృందం శనివారం బహ్రెయిన్కు చేరుకుంది. ఇందులో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ నిశికాంత్ దూబేలు ఉన్నారు. ఉత్తర దక్షిణ దృవాలయినా ఈ ఇద్దరు వైరుధ్య భావాలు కలిగిన సభ్యులు కీలక ముస్లిం దేశాల పర్యటనలో ఉండడం విశేషం. తాను, ఒవైసీ ఒకే విధానాన్ని అంతర్జాతీయంగా చెప్పడానికి ఉద్దేశించిన బృందంలో సహచరులు కావడం ప్రజాస్వామ్యం విశిష్ఠత అని దూబే వ్యాఖ్యానించారు. మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగాలు కూడా ఇందులో ఉన్నారు. బహ్రెయిన్లో రెండు రోజుల పాటు సమావేశమైన అనంతరం వీరు కువైత్కు అక్కడి నుండి 27న రాత్రి సౌదీ అరేబియాకు చేరుకొని అక్కడి నుండి అల్జెరియాకు బయలుదేరి వెళ్తారు.
మరాఠ యోధుడు, శరద్ పవార్ తనయ సుప్రియా సులే నేతృత్వంలోని బృందం శనివారం రాత్రి ఖతర్కు రానుండగా, అందులో తెలుగుదేశం ఎంపీ లావు కృష్ణదేవరాయులుతో పాటు మాజీ విదేశీ మంత్రులు వి. మురళీధరన్, మనిష్ తీవారి, తెలుగువాడయిన మాజీ దౌత్యవేత్త సయ్యద్ అక్బరోద్దీన్లు ఉన్నారు. ఖతర్ నుండి ఈజిప్టు, ఈథియోపియా, దక్షిణాఫ్రీకా దేశాల్లో కూడా ఈ బృందం పర్యటిస్తుంది.
రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సభ్యురాలిగా ఉన్న బృందం బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఐరోపా దేశాల్లో పర్యటిస్తుంది. దీనికి బీజేపీ మాజీ కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ నేతృత్వం వహిస్తున్నారు.
అమలాపూరం ఎంపీ హరీష్ బాలయోగి.. కేంద్ర మాజీ మంత్రి శశీథరూర్ నేతృత్వంలోని బృందంలో సభ్యుడిగా ఉండగా ఈ బృందం అమెరికా, బ్రెజిల్, పనామా ఇతర దక్షిణ అమెరికా దేశాలను పర్యటిస్తుంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తనయుడయిన శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని బృందం తన యూఏఈ పర్యటనను ముగించుకొని శనివారం తిరిగి వెళ్ళింది.
ఇవి కూడా చదవండి:
BATA, TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల’ 12వ వార్షికోత్సవం
అమెరికా కీలక నిర్ణయం.. నిబంధనలు ఉల్లంఘించిన భారతీయ ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు
హెచ్-1బీ వీసాలపై భారతీయ అమెరికన్ షాకింగ్ పోస్టు.. జనాల గగ్గోలు
Updated Date - May 24 , 2025 | 10:18 PM