NRI: శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో రామాయణ ప్రవచనామృతం
ABN, Publish Date - Aug 12 , 2025 | 09:59 PM
సింగపూర్లో శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో మహా సహస్రావధాని డా. మేడసాని మోహన్ ప్రవచనామృతం ఆకట్టుకుంది. స్థానిక ఎన్నారైలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్లో శ్రీమద్రామాయణ వైశిష్ట్యంపై పంచ మహా సహస్రావధాని డా. మేడసాని మోహన్ మూడు రోజులపాటు నిర్వహించిన ప్రత్యేక ప్రవచన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
సింగపూర్ దేశపు నాలుగు మూలల నివసించే తెలుగువారందరికీ అందుబాటులో ఉండేలా 5 వేర్వేరు వేదికలలో 5 భాగాలుగా, 15 గంటల పాటు మొత్తం రామాయణంలోని 7 కాండలు, రామాయణ ప్రాశస్త్యంపై సోదాహరణంగా సవివరంగా డా. మేడసాని మోహన్ ప్రవచించారు.
ఐదు వేదికలలోనూ సుమారు 250 మంది తెలుగు వారు పాల్గొనగా ‘సింగపూర్ తెలుగు టీవీ'వారి సాంకేతిక నిర్వహణలో ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది. ఆన్లైన్ ద్వారా దాదాపుగా 2000 మంది పైగా వీక్షించారు. వాల్మీకి రామాయణంలోని సంస్కృత శ్లోకములు, తెలుగులో రామాయణ కల్పవృక్షము, భాస్కర రామాయణము వంటి వాటి నుండి తెలుగు పద్యములను కూడా ఉదహరిస్తూ, కథను ఆసక్తికరంగా వర్ణిస్తూ, రామాయణంలో నిక్షిప్తమై ఉన్న ఎన్నో అంశాలను, జీవన విధానానికి తోడ్పడే నైతిక సూత్రాలను కూడా రామాయణ గాథతో మేళవించి, పిల్లలు పెద్దలు అందరినీ ఆకట్టుకునే విధంగా మేడసాని వారు తమ ప్రవచనం అందించారు.
ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి రాజ్యలక్ష్మి దంపతులు డాక్టర్ మేడసాని మోహన్కు ఆతిథ్యమీయగా, మొదటి వేదిక పంగోల్ రివర్వెల్ కాండోలోను, రెండవ వేదిక బర్గండీ క్రెసెంట్ లోను, మూడవ వేదిక మెల్విల్ కాండోలోను, నాలుగవ వేదిక క్యాన్బర్రా కాండోలోను, 5వ వేదిక జూబిలీ రోడ్లోను ఏర్పాటు చేశారు. ఈ వేదికలతో పాటు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు బీవీఆర్ చౌదరి గృహంలో నిత్య సుందరాకాండ పారాయణం కార్యక్రమం కూడా ఘనంగా జరగడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. 15వ తేదీ రామ పట్టాభిషేకంతో ఈ పారాయణం సుసంపన్నం అయ్యింది.
సంస్థ సభ్యులు రాధిక మంగిపూడి, సుబ్బు పాలకుర్తి ఈ సభలకు వ్యాఖ్యానం చేయగా, ప్రొ. బీవీఆర్ చౌదరి దంపతులు, సౌభాగ్యలక్ష్మీ రాజశేఖర్ తంగిరాల దంపతులు, సుబ్బు పాలకుర్తి మాధవి దంపతులు, సత్య జాస్తి సరిత దంపతులు, రామాంజనేయులు చామిరాజు రేణుక దంపతులు, రంగా ప్రకాష్ కాండూరి తేజశ్వని దంపతులు ఈ 5 వేదికల ఏర్పాటులో సహకరించారని, మరి ఎంతో మంది దాతలు అన్నదానానికి ఆర్థిక సహాయం అందించారని తెలుపుతూ వారందరికీ సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ అయిదు వేదికలలో రామనామ కీర్తనలు ఆలపించిన గాయనీమణులు కృష్ణకాంతి , స్నిగ్ధ ఆకుండి, సౌభాగ్యలక్ష్మి తంగిరాల, కాండూరి శ్రీసన్వి, శ్రీధన్వి, షర్మిల చిత్రాడ లకు నిర్వాహుకులు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు ప్రకాశరావు దంపతులు, రంగా రవి దంపతులు, సీనియర్ సభ్యులు లక్ష్మీనారాయణ దంపతులు తదితరులు పాల్గొన్న ఈ సభలో, సింగపూర్ తెలుగు టీవీ నిర్వాహకులు గణేశ్న రాధాకృష్ణ కాత్యాయని దంపతులు, సత్య జాస్తి కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందించారు. సంస్థ సభ్యులు పాతూరి రాంబాబు, శ్రీధర్ భారద్వాజ్, రామాంజనేయులు చామిరాజు, గుంటూరు వెంకటేష్ తదితరులు కార్యక్రమ నిర్వహణలో సహకరించారు.
యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమం మరల వీక్షించుటకు లింకులు:
ఫ్రిస్కో హనుమాన్ ఆలయంలో కొలువైన శ్రీవారు
పీ-4 పథకానికి ప్రవాసీయులు ముందుకు రావాలి: చంద్రబాబు
Updated Date - Aug 13 , 2025 | 09:42 AM