TANA: తానాలో కృష్ణా జిల్లా వాసుల సమావేశం
ABN, Publish Date - Jul 10 , 2025 | 09:47 AM
తానా 24వ మహాసభలను పురస్కరించుకుని కృష్ణా జిల్లాకు చెందిన వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జిల్లా పేరు మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 24వ ద్వైవార్షిక మహాసభలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా ఎన్నారైల మీట్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత జాయింట్ సెక్రటరీ వెంకట్ కోగంటితో పాటు ఈసీ మెంబర్స్ నాగ పంచుమర్తి, రవి వడ్లమూడి, రాజా కసుకుర్తి, నరేష్ రావూరి, రాజా సూరపనేని, ఠాగూర్ మల్లినేని, కిరణ్ దుగ్గిరాల, పరుచూరి రామకృష్ణ సమన్వయపరిచారు.
ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కృష్ణా జిల్లాను జగన్ పాలనలో అన్యాయంగా విడగొట్టి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాగా చేశారని, ఎన్టీఆర్ అనే వ్యక్తి కృష్ణా జిల్లావాసి, ప్రపంచ వ్యక్తి అని అన్నారు. జిల్లా విభజన వల్ల ఎన్టీఆర్ లాంటి మహానటుడు కృష్ణాజిల్లా వ్యక్తి అని చెప్పుకునే అవకాశం పోయిందని అన్నారు. ఇక్కడ ఏపీ ప్రభుత్వానికి చెందిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు ఈ విషయంలో ఏదైనా చేయాలని కోరారు.
దీనిపై రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, తన తల్లితండ్రులు గోదావరి జిల్లా వాసులైనప్పటికీ తాను పెరిగిందంతా కృష్ణా జిల్లాలోనే అని అన్నారు. విజయవాడలోనే తన జీవితం అంతా సాగిందని, అందువల్లనే చాలామంది తనకు ఆత్మాభిమానం ఎక్కువ అని అంటారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాను ఇక నుంచి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా మార్చాలని కోరుతానని చెప్పారు. దీనివల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని అన్నారు.
ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, సంధ్యారాణి, నవీన్ ఎర్నేని, ప్రసాద్ గారపాటి, కిరణ్ దుగ్గిరాల, వడ్లమూడి రవిచంద్ర, లావు అంజయ్య చౌదరి, మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ నోరి దత్తాత్రేయుడు, తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న కృష్ణా జిల్లా ప్రవాసాంధ్రుడు డా. కొడాలి నరేన్కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన పలువురు జిల్లా సామాజిక, సాంఘిక, రాజకీయ చరిత్రపై ప్రసంగించారు. జిల్లా అభివృద్ధికి ప్రవాసాంధ్రులు సహకరించాలని కోరారు. నవీన్ ఎర్నేని, జయరాం కోమటి, ప్రసాద్ గారపాటి, నోరిదత్తాత్రేయుడు, చెన్నూరి వెంకట సుబ్బారావు, ఆర్ఆర్ఆర్, ఏబీ వెంకటేశ్వరరావు తదితరులను మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి శ్రీనివాస వట్టికుట్టి, విజయ్ జెట్టి, నాగకుమార్ బెల్లంకొండ, భాను వేమూరి, శ్రీహరి తదితరులు కూడా సహకరించారు.
ఈ వార్తలనూ చదవండి:
డల్లాస్లో ఎన్నారై టీడీపీ ఆత్మీయ సమావేశం.. పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు
యూఎస్ఏలో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Updated Date - Jul 10 , 2025 | 10:05 AM