GAMA Awards: దుబాయిలో టాలీవుడ్ జీఏఎమ్ఏ అవార్డుల సన్నాహాల జోరు
ABN, Publish Date - Jun 24 , 2025 | 10:39 PM
టాలీవుడ్ ప్రతిభను ఇంటా బయటా ప్రతిబింబించే దుబాయి కేంద్రంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రతిష్టాత్మమైన జీఏఎమ్ఏ అవార్డుల కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: టాలీవుడ్ ప్రతిభను ఇంటా బయటా ప్రతిబింబించే దుబాయి కేంద్రంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రతిష్టాత్మమైన జీఏఎమ్ఏ (Gulf Academy Movie Awards) అవార్డుల కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దుబాయిలో ఇప్పటికే నాలుగు ఎడిషన్లను జరుపుకొన్న గామా తమ తదుపరి కార్యక్రమాన్ని ఆగష్టు 30న అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు 30న టాలీవుడ్ అవార్డ్స్తో పాటు ఆగస్టు 29న ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకను నిర్వహించేలా భారీ సన్నాహాలు జరుగుతున్నాయి.
దీనికి సంబంధించిన థీమ్ సాంగ్ను శనివారం దుబాయిలో లాంఛనంగా విడుదల చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ పాటకు ఆకర్షణీయమైన సాహిత్యం అందించారు. రఘు కుంచె సాంగ్ కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా పాడారు. ఈ సంగీత ప్రదర్శనను యూఏఈలోని తెలుగు ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్.. హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, దక్ష నాగర్కర్ తో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకులు, టాప్ టెక్నీషియన్స్ పాల్గొననున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు.
అదే విధంగా హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, ప్రియా హెగ్డే, శ్రీదేవిలు తమ ప్రత్యేక ప్రదర్శనలతో అలరించనున్నారని వారు పేర్కొన్నారు. ప్రత్యేక అతిథులుగా బ్రహ్మానందం, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్, నిర్మాతలు అశ్విని దత్, డీవీవీ దానయ్య, చంద్రబోస్, వెన్నెల కిషోర్ తదితర ప్రముఖులు రానున్నారని నిర్వాహకులు తెలిపారు.
టాలీవుడ్ 24 క్రాఫ్ట్స్కు ఈ అవార్డ్స్ను అందించనున్నారు. 2024లో విడుదలైన చిత్రాల్లో నామినేట్ అయిన విభాగాలకు, పబ్లిక్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తామని వారన్నారు. గామా అవార్డ్స్ 2025 జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు ఎ. కోదండ రామిరెడ్డి, ప్రముఖ సంగీత దర్శకులు కోటి, ప్రముఖ సినీ దర్శకులు బి. గోపాల్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు గామా అవార్డులను ప్రదానం చేస్తామని నిర్వాహకులు చెప్పారు.
ఈ సందర్భంగా ‘గామా అవార్డ్స్’ ఛైర్మన్ త్రిమూర్తులు మాట్లాడుతూ ‘ దుబాయ్లో జరిగే ఏకైక అతి పెద్ద వేడుక గామా అవార్డ్స్. గత నాలుగు ఎడిషన్లు ఘనంగా పూర్తి చేసుకొని ఈసారి ఆగస్ట్ 30న 5వ ఎడిషన్కు తెలుగు ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఆశిస్తున్నట్లుగా చెప్పారు. Keinfra Properties సౌజన్యంతో అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా ఆయన చెప్పారు.
‘గామా అవార్డ్స్’ సీఈవో సౌరభ కేసరి మాట్లాడుతూ ‘వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గుర్తించి వారికి ది గామా ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇచ్చి సత్కరించనున్నట్లుగా వెల్లడించారు. విశాలమైన పార్కింగ్ కలిగిన షార్జా ఎక్స్పో సెంటర్లో 10 వేల మంది సభికులు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆయన అన్నారు. వినూత్న రీతిలో జరగబోయే ఈ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు, అందర్నీ అలరించే వినోద కార్యక్రమాలు, అద్భుతమైన షోలు ఉంటాయి’ అని సౌరభ కేసరి చెప్పారు.
ఇవీ చదవండి:
లాస్ ఏంజెలెస్లో ధీమ్ తానా-2025 పోటీలు విజయవంతం
దుబాయి మండుటెండలో గోదావరి యువకుల ఆకలి ఆర్తనాదాలు
Updated Date - Jun 24 , 2025 | 10:43 PM