Karthika Masam with delicious sabudana: ఉపవాసవేళ సగ్గుబియ్యంతో..
ABN, Publish Date - Oct 25 , 2025 | 05:01 AM
కార్తికమాసం వచ్చేసింది. మనలో చాలామంది సోమవారాలు,ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండి పూజలు చేస్తుంటారు. ఆ రోజుల్లో సగ్గుబియ్యంతో తయారుచేసిన ఉప్మా,పాయసంలాంటి వాటిని మితంగా తీసుకుంటూ ఉంటారు. ఇవి కాకుండా సగ్గుబియ్యంతో సులువుగా తయారుచేసుకోగలిగే విభిన్న వంటకాలు మీ కోసం...
కార్తికమాసం వచ్చేసింది. మనలో చాలామంది సోమవారాలు,ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండి పూజలు చేస్తుంటారు. ఆ రోజుల్లో సగ్గుబియ్యంతో తయారుచేసిన ఉప్మా,పాయసంలాంటి వాటిని మితంగా తీసుకుంటూ ఉంటారు. ఇవి కాకుండా సగ్గుబియ్యంతో సులువుగా తయారుచేసుకోగలిగే విభిన్న వంటకాలు మీ కోసం...
సగ్గుబియ్యం బర్ఫీ
కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం- ఒక కప్పు, ఫుల్ క్రీమ్ మిల్క్- అర లీటరు, చక్కెర- ఒక కప్పు, నెయ్యి- అయిదు చెంచాలు, యాలకులు- రెండు, బాదం- అయిదు, పిస్తా పలుకులు- కొన్ని, జీడిపప్పు- కొద్దిగా
తయారీ విధానం
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి, అందులో సగ్గుబియ్యం వేసి చిన్న మంట మీద దోరగా వేయించాలి. తరువాత పళ్లెంలోకి తీసి చల్లార్చాలి. ఆపైన మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జల్లించాలి. స్టవ్ మీద పాన్ పెట్టి, దానిలో నెయ్యి వేసి కరిగించాలి. అందులో సగ్గుబియ్యం పిండి వేసి బాగా కలుపుతూ అయిదు నిమిషాలపాటు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి.
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి పాలు పోసి చిక్కగా మారేవరకు చిన్న మంట మీద మరిగించాలి. అయిదు నిమిషాల తరువాత చక్కెర వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత నెయ్యిలో వేయించిన సగ్గుబియ్యం పిండి వేసి కలపాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరకు వచ్చేవరకూ కలుపుతూ ఉండాలి. చివరగా యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. నెయ్యి రాసిన పళ్లెంలో ఈ మిశ్రమాన్ని వేసి సమంగా పరచాలి. దానిపైన పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు చల్లాలి. గంట తరువాత ముక్కలుగా కోసి పళ్లెంలోకి తీయాలి.
సగ్గుబియ్యం పరాటా
కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం- ఒక కప్పు, ఆలుగడ్డలు- పెద్దవి మూడు, అల్లం తురుము- అర చెంచా, పచ్చి మిర్చి- రెండు, మిరియాల పొడి- అర చెంచా, జీలకర్ర- ఒక చెంచా, ఉప్పు- ఒక చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా, కుట్టు పిండి లేదా సింగాడ పిండి లేదా రాజ్గిర పిండి- అర కప్పు, నెయ్యి- తగినంత
తయారీ విధానం
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి, అందులో సగ్గుబియ్యం పోసి చిన్న మంట మీద దోరగా వేయించాలి. తరువాత ఒక పళ్లెంలోకి తీసి చల్లార్చాలి. ఆపైన మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ సగ్గుబియ్యం పిండిని జల్లించి గిన్నెలోకి తీసుకోవాలి. ఆలుగడ్డలను ఉడికించి తొక్క తీసి, తురిమి పెట్టుకోవాలి.
వెడల్పాటి గిన్నెలో సగ్గుబియ్యం పిండి, అల్లం తురుము, పచ్చి మిర్చి ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. తరువాత ఆలుగడ్డ తురుము వేసి కలపాలి. ఆపైన కొద్దికొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ ముద్దలా చేయాలి. దీదామీద మూతపెట్టి పావుగంట సేపు నానబెట్టాలి. తరువాత చేత్తో కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ గుండ్రని ముద్దల్లా చేయాలి. చపాతీ పీట మీద ఒక్కో ముద్ద పెట్టి... కుట్టు లేదా సింగాడ లేదా రాజ్గిర పిండి చల్లుతూ చపాతీల్లా ఒత్తాలి. స్టవ్ మీద పాన్ పెట్టి ఒక్కో చపాతీ వేస్తూ రెండు వైపులా ఎర్రగా వేయించాలి. చివరగా చెంచాతో నెయ్యి రాసి పళ్లెంలోకి తీయాలి. ఈ పరాటాలను కొత్తిమీర చట్నీతో తినవచ్చు.
సగ్గుబియ్యం నగ్గెట్స్
కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం- అర కప్పు, ఉడికించిన ఆలుగడ్డలు- రెండు, వేయించిన పల్లీల పొడి- పావు కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్టు- ఒక చెంచా, జీలకర్ర పొడి- ఒక చెంచా, నిమ్మరసం- ఒక చెంచా, ఉప్పు- తగినంత, కొత్తిమీర తరుగు- కొద్దిగా, నూనె- డీప్ ఫ్రైకి తగినంత
తయారీ విధానం
సగ్గుబియ్యాన్ని వేయించి, పొడిచేసి పెట్టుకోవాలి. ఆలుగడ్డలను సన్నగా తురుముకోవాలి. వెడల్పాటి గిన్నెలో సగ్గుబియ్యం పొడి, పల్లీల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్టు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. తరువాత ఆలుగడ్డ తురుము, నిమ్మరసం వేసి కలిపి ముద్దలా చేయాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో కొద్దికొద్దిగా తీసుకుంటూ నగ్గెట్స్ మాదిరిగా తయారుచేయాలి. స్టవ్ మీద మూకుడు పెట్టి. సగానికిపైగా నూనె పోసి వేడిచేయాలి. అందులో నగ్గెట్స్ వేసి చిన్న మంట మీద ఎర్రగా వేయించి పళ్లెంలోకి తీయాలి. గ్రీన్ చట్నీతో తింటే ఈ నగ్గెట్స్ రుచిగా ఉంటాయి.
Updated Date - Oct 25 , 2025 | 05:01 AM